Turkey Earthquake | తుర్కియే, సిరియాలో సంభవించిన భూకంప ధాటికి ఇప్పటి వరకు 11 వేల మందికి పైగా మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ భూకంప శిథిలాల కింద ఓ భారతీయుడు చిక్కుకున్నట్లు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరో 10 మంది భారతీయులను ప్రాణాలతో బయటపడినట్లు పేర్కొంది. అయితే తుర్కియేలోని వివిధ ప్రాంతాల్లో 3 వేల మంది భారతీయులు నివసిస్తున్నట్లు తెలిపింది. శిథిలాల కింద చిక్కుకున్న వ్యక్తి బెంగళూరు వాసి అని పేర్కొంది. అతని కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నామని తెలిపింది.
ఎముకలు కొరికే చలిలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. దాంతో రెస్క్యూ బృందాలు, స్థానికులు వెచ్చదనం కోసం చుట్టుపక్కలున్న చెత్తను పోగేసి నిప్పుపెడుతున్న దృశ్యాలు అక్కడక్కడ కనిపిస్తున్నాయి. భారత్ నుంచి కూడా రెండు వాయుసేన విమానాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, రెస్క్యూ ఆపరేషన్ల కోసం ప్రత్యేక తర్ఫీదు పొందిన డాగ్ స్క్వాడ్ టర్కీకి తరలివెళ్లాయి. ప్రస్తుతం ముమ్మరంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఇండియా తరపున తుర్కియేకు మెడిసిన్స్, ఇతర సామాగ్రిని అందించినట్లు కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ వెల్లడించారు.