Drunk Driving | దుబాయ్లో ఓ భారతీయుడికి అక్కడి అధికారులు షాక్ ఇచ్చారు. తాగి వాహనం నడిపినందుకుగానూ భారీగా జరిమానా విధించారు. బుర్ దుబాయ్లోని సమీప ప్రాంతంలో భారత్కు చెందిన 39ఏళ్ల వ్యక్తి మద్యం సేవించి వాహనం నడుపుతూ వెళ్లాడు. ఈ క్రమంలో అదుపుతప్పి రోడ్డు పక్కన పార్క్ చేసిన ఓ కారును ఢీ కొట్టాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.
సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా సదరు వ్యక్తిని గుర్తించిన అక్కడి పోలీసులు.. ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టగా.. అతనికి న్యాయమూర్తి 25,000 దిర్హమ్స్ ఫైన్ కింద కట్టాలని ఆదేశించారు. అంటే మన కరెన్సీ ప్రకారం రూ.5,56,672. రెండు రోజుల కస్టడీలో ఉన్న అతను బెయిల్పై విడుదలయ్యాడు. ఆగస్టు 18న జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
ట్రాఫిక్ రూల్స్ను పాటించకుంటే దుబాయ్ ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా మద్యం సేవించి వాహనం నడిపితే కనీసం 20,000 దిర్హామ్ల జరిమానాతోపాటు జైలు శిక్ష విధిస్తారు. 60 రోజుల పాటు వాహనాన్ని సైతం జప్తు చేస్తారు. మూడు నెలల నుంచి రెండు సంవత్సరాల పాటు డ్రైవింగ్ లైసెన్స్ను రద్దు చేస్తారు.