న్యూఢిల్లీ: పెగాసస్ స్పై సాఫ్ట్వేర్ను ఇండియాకు ఇజ్రాయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ డీల్ కుదిరిన తర్వాతనే.. ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు వ్యతిరేకంగా ఇండియా ఓటేసినట్లు తెలుస్తోంది. యూఎన్ ఎకనామిక్స్ అండ్ సోషల్ కౌన్సిల్ సమావేశంలో జరిగిన ఓటింగ్ లో.. ఇజ్రాయిల్కు అనుకూలంగా ఇండియా ఓటేసినట్లు న్యూయార్క్ టైమ్స్ తేల్చింది. 2019 జూన్ 6న ఆ ఓటింగ్ జరిగింది. ఈ అంశంపై ఏడాది పాటు విచారణ చేపట్టిన న్యూ యార్క్ టైమ్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. పెగాసస్ సాఫ్ట్వేర్ ద్వారా ఐఫోన్లు, ఆండ్రాయిడ్ ఫోన్లను హ్యాక్ చేసే వీలు ఉంటుంది. ఎన్క్రిప్టెడ్ మెసేజ్లను ఆ సాఫ్ట్వేర్తో డీకోడ్ చేయవచ్చు.
2017లో ప్రధాని మోదీ ఇజ్రాయిల్లో పర్యటించారు. ఆ సమయంలో రెండు వందల కోట్ల డాలర్ల మిస్సైళ్ల ఒప్పందం కుదిరింది. అయితే ఆ సమయంలోనే ప్రధాని మోదీకి పెగాసస్ ఆఫర్ ఇచ్చినట్లు అమెరికా పత్రిక పేర్కొన్నది. పెగాసస్ సాఫ్ట్వేర్ ఆఫర్ వచ్చిన నేపథ్యంలో ఇండియా .. యూఎన్ భేటీలో అబ్జర్వర్ స్టేటస్ను వదులుకుని.. పాలస్తీనాకు వ్యతిరేకంగా ఓటేసినట్లు అనుమానిస్తున్నారు. ఇజ్రాయిల్కు మద్దతుగా యూఎన్లో ఇండియా ఓటు వేయడం వల్ల ఆ దేశం అరబ్ దేశాలతో డీల్ కుదుర్చుకున్నట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొన్నది.
మోదీ సర్కార్ను వ్యతిరేకిస్తున్నవారినే పెగాసస్ సాఫ్ట్వేర్ ద్వారా టార్గెట్ చేసినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ ఇజ్రాయల్కు చెందిన ఎన్ఎస్ఓ కంపెనీ అన్ని అంశాలను సూపర్వైజ్ చేస్తున్నట్లు ఆ దేశ అంబాసిడర్ నోర్ గిలాన్ తెలిపారు. అమెరికాకు చెందిన ఎఫ్బీఐకి కూడా పెగాసస్ సాఫ్ట్వేర్ను అమ్మారు. కానీ ఆ దేశం ఈ సాఫ్ట్వేర్ను వాడలేదని తేలింది.
పెగాసస్ సాఫ్ట్వేర్ ద్వారా మెక్సికోలో డ్రగ్ కింగ్ ఎల్ చాపోను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. యురోప్ దేశాల్లో ఉగ్రవాద కదలికలను పసికట్టారు. వ్యవస్థీకృత నేరాలను కూడా అదుపు చేసినట్లు తెలుస్తోంది. అయితే మెక్సికోలో జర్నలిస్టులు, రాజకీయ రెబల్స్పైన కూడా పెగాసస్ను వాడినట్లు ఓ అంచనాకు వచ్చారు. గల్ఫ్ దేశాలైన యూఏఈ, సౌదీ అరేబియాలోనూ ఈ సాఫ్ట్వేర్ను వాడారు.