భారత్పై చైనా మరోసారి విషం కక్కింది. సరిహద్దు సమీపంలో తరచూ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉద్రిక్తతలు పెంచుతున్న డ్రాగన్ దేశం.. ఇప్పుడు మరో వివాదానికి తెరతీసింది. అరుణాచల్ ప్రదేశ్ తమదేనని వాదిస్తున్న చైనా.. తాజా భారత్ నేతలు ఈ భూభాగంలో పర్యటిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించింది. ఇటీవల భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అరుణాచల్ ప్రదేశ్లో పర్యటించడాన్ని తప్పుబట్టింది.
ఈ నెల 9న వెంకయ్యనాయుడు అరుణాచల్ ప్రదేశ్లో పర్యటించి, అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ప్రసంగించారు. కొన్ని దశాబ్దాలుగా నిర్లక్ష్యం చేసిన ఈశాన్య భారతంలో ఇప్పుడు అభివృద్ధి పరుగులు పెడుతోందని ఈ సందర్భంగా వెంకయ్య అన్నారు. కానీ వెంకయ్య నాయుడు పర్యటనను చైనా తప్పుబట్టింది. భారతీయ నేతలు ఈ భూభాగంలో పర్యటించడం ద్వైపాక్షిక ఒప్పందాల ఉల్లంఘణ కిందకు వస్తుందని పేర్కొంటూ భారత విదేశాంగ మంత్రిత్వ శాఖకు సమాచారాన్ని పంపించింది. ఇలాంటి పర్యటనలు భవిష్యత్లో చేస్తే ఊరుకోబోమని హెచ్చరించినట్లు సమాచారం.
చైనా తీరుపై భారత ప్రభుత్వం మండిపడింది. అరుణాచల్ ప్రదేశ్ ముమ్మాటికీ భారత్లో అంతర్భాగమేనని స్పష్టం చేసింది. భారత్కు చెందిన ప్రముఖులు ఎప్పుడైనా సరే అరుణాచల్ప్రదేశ్లో పర్యటిస్తారని తేల్చి చెప్పింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ఒక ప్రకటన విడుదల చేశారు. భారత్లోని ఇతర రాష్ట్రాల్లో పర్యటించినట్టుగానే.. అరుణాచల్ ప్రదేశ్లో కూడా భారతీయ నేతలు పర్యటిస్తుంటారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తే ఊరుకోబోమని ఆయన తెలిపారు.
100 మంది సైనికులతో చొరబాటుకు యత్నం
ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్పై చైనా ఎప్పటినుంచో కన్నేసింది. ఈ క్రమంలోనే అక్కడి సరిహద్దుల్లో గ్రామాలను నిర్మిస్తుంది. అంతటితో ఆగకుండా అరుణాచల్ ప్రదేశ్ను తమ భూభాగంలో చూపిస్తూ అప్పట్లో చైనా మ్యాపులను ముద్రించింది. డ్రాగన్ దేశం చర్యలను భారత్ మొదట్నుంచి తప్పుపడుతూనే ఉంది. అయినప్పటికీ చైనా వెనక్కి తగ్గడం లేదు. తన దుందుడకు చర్యలను కొనసాగిస్తూనే ఉంది. ఈ క్రమంలో సరిహద్దుల్లో శాంతి చర్యలు అంటూనే చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. తాజాగా 13వ కోర్ కమాండర్ చర్చలకు ముందు కూడా చైనా కవ్వింపు చర్యలకు పాల్పడింది. అరుణాచల్ప్రదేశ్లోని తవాంగ్ సమీపంలో డ్రాగన్ సైనికులు భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చేందుకు ప్రయత్నించారు. దాదాపు 100 మంది సైనికులు భారత్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించగా.. వారిని భారత ఆర్మీ నిలువరించింది. దీంతో కొద్ది గంటల సేపు యుద్ధ వాతావరణం నెలకొంది.