ఢాకా/కొలంబో/లండన్, మే 8: భారత్లో కేసుల ఉద్ధృతికి కారణమని భావిస్తున్న మూడు కరోనా రకాల్లో బీ.1.617.2 రకం స్ట్రెయిన్ను పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్లో కూడా గుర్తించారు. దీంతో ఇరు దేశాలూ అప్రమత్తమయ్యాయి. బంగ్లాదేశ్లో రాత్రికి రాత్రే ఆరు కేసులు వెలుగులోకి వచ్చాయి. వారంతా ఇటీవల భారత్కు వెళ్లొచ్చారని బంగ్లాదేశ్ వైద్య సేవల డైరెక్టర్ జనరల్ (డీజీహెచ్ఎస్) కార్యాలయం తెలిపింది. ఈ ఆరుగుర్నీ క్వారంటైన్లో ఉంచారు. ఈ నేపథ్యంలో భారత్తో సరిహద్దులను మూసివేతను మరో 14 రోజులు పొడిగించాలని బంగ్లాదేశ్ నిర్ణయించింది. శ్రీలంకలో ఇండియన్ వేరియంట్ తొలి కేసును గుర్తించారు. ఈ వ్యక్తి కూడా భారత్ నుంచి ఇటీవల తిరిగివచ్చాడని శ్రీలంక అధికారులు తెలిపారు.
మిగిలినవాటికన్నా ఎక్కువ వ్యాప్తి: బ్రిటన్
భారత్లోని బీ.1.617.2 రకం స్ట్రెయిన్పై బ్రిటన్ శాస్త్రవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ (పీహెచ్ఈ).. వేరియెంట్ ఆఫ్ కన్సర్న్ (వీవోసీ-ఆందోళన కలిగించే రకం) జాబితాలో చేర్చింది. భారత్లో గుర్తించిన మిగతా రెండు వేరియెంట్ల కంటే ఇది ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్టు కనుగొన్నారు.