జెనీవా, జూలై 13: ఇప్పటికే పలు అంతర్జాతీయ సూచీల్లో నేలచూపులు చూస్తున్న భారత్.. తాజాగా లింగ సమానత్వ సూచీలోనూ అట్టడుగునే నిలిచింది. ప్రపంచ ఆర్థిక వేదిక బుధవారం లింగ సమానత్వ సూచీ నివేదికను విడుదల చేసింది. అందులో 146 దేశాలకుగానూ భారత్ 135 ర్యాంక్లో ఉన్నది. గతంతో పోల్చితే కేవలం 5 స్థానాలు మెరుగైంది. 11 దేశాలే మన దేశం కంటే దిగువన ఉన్నాయి. నివేదిక ప్రకారం.. ఐస్లాండ్ తొలి స్థానాన్ని నిలుపుకొన్నది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా ఫిన్లాండ్, నార్వే, న్యూజిలాండ్, స్వీడన్ నిలిచాయి. అత్యంత దారుణంగా చివరి 5 స్థానాల్లో ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్, కాంగో, ఇరాన్, చాద్ ఉన్నాయి.
భారత్లో మహిళల ఆదాయం పెరిగినా, లింగ సమానత్వ విలువలు మాత్రం తగ్గిపోయాయి. చట్టసభల్లో, సీనియర్ ర్యాంకుల్లో మహిళలు 14.6 శాతం నుంచి 17.6 శాతానికి పెరిగారని, ప్రొఫెషనల్, టెక్నికల్ స్థాయిలో 29.2 శాతం నుంచి 32.9 శాతానికి పెరిగారని నివేదిక తెలిపింది. ఆరోగ్యం-మనుగడ (హెల్త్ అండ్ సర్వైవల్) సూచీలోనైతే అత్యంత దారుణంగా భారత్ 146వ స్థానానికి పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రాథమిక విద్య నమోదు, తృతీయ విద్యా నమోదులో లింగ సమానత్వం పరంగా అగ్రస్థానంలో నిలిచినట్టు పేర్కొన్నది. అటు.. ప్రపంచవ్యాప్తంగా జీవన వ్యయ సంక్షోభ ప్రభావం మహిళలపై ఎక్కువగా పడిందని, ముఖ్యంగా శ్రామిక శక్తిలో అంతరం తీవ్ర ప్రభావం చూపిస్తున్నదని నివేదిక వెల్లడించింది.
కరోనాతో ఒక తరం వెనక్కి
ప్రపంచంలోని అనేక రంగాలను చావు దెబ్బ కొట్టిన కరోనా.. లింగ సమానత్వంపైనా తన ప్రతాపాన్ని ప్రదర్శించిందని నివేదిక తెలిపింది. కరోనా వల్ల లింగ సమానత్వాన్ని ఏకంగా ఒక తరం వెనక్కి నెట్టిందని వెల్లడించింది. పునరుద్ధరణ మరింత బలహీనపడిందని చెప్పింది. లింగ సమానత్వంలో ప్రస్తుతం ఉన్న వ్యత్యాసాన్ని పూడ్చాలంటే మరో 132 ఏండ్లు పడుతుందని వివరించింది. మొత్తం 146 దేశాల్లో ప్రతి ఐదింటిలో ఒక్క దేశం మాత్రమే లింగభేదాన్ని కనీసం 1 శాతాన్ని తగ్గించాయని పేర్కొన్నది. దక్షిణాసియాలో లింగ భేదం అంతరాన్ని పూడ్చాలంటే 197 ఏండ్లు పడుతుందని స్పష్టం చేసింది.