ఐక్యరాజ్యసమితి, జూలై 15: అభివృద్ధిలో ప్రపంచ దేశాలన్నీ మనవైపే చూస్తున్నాయంటూ గప్పాలు కొడుతున్న మోదీ సర్కారు.. పిల్లలకు కనీసం వ్యాక్సిన్లు ఇవ్వలేని స్థితిలోకి దిగజారిపోయింది. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న నైజీరియా, ఇథియోపియా వంటి దేశాలతో పోటీపడుతున్నది. అవును. పసిపిల్లల్లో సాధారణంగా కనిపించే డిఫ్తీరియా (కంఠవాతం), ధనుర్వాతం, కోరింత దగ్గును నియంత్రించే డీటీపీ3 వ్యాక్సిన్ ఇవ్వడంలో భారత్ ఎంతో వెనుకబడిపోయినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో), యూనిసెఫ్ తాజా నివేదిక పేర్కొన్నది. కిందటేడాది ప్రపంచవ్యాప్తంగా సుమారు 2.5 కోట్ల మంది పిల్లలకు డీటీపీ3 వ్యాక్సిన్ (ఒకటి లేదా అంతకంటే ఎక్కువ డోసులు) అందలేదని వెల్లడించింది. నైజీరియా, ఇథియోపియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ తదితర దేశాల్లో డీటీపీ3 వ్యాక్సిన్ ప్రక్రియ ఆశించిన స్థాయిలో లేదని, ఆ దేశాలతో భారత్ పోటీపడుతున్నట్టు వివరించింది.
కొవిడ్ ఒక్కటే కారణం కాదు ..
చిన్నారుల ఆరోగ్యానికి ఇది రెడ్అలర్ట్. పిల్లల వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్లో భారీ తగ్గుదల.. పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడడమే. కొవిడ్ కారణంగా ఆరోగ్య వ్యవస్థ, వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్లపై ప్రభావం పడినమాట వాస్తవమే. అయితే, దీన్నే ప్రాతిపదికగా తీసుకోలేం. ఎందుకంటే ఉగాండా వంటి వెనుకబడిన దేశాల్లోనూ పిల్లలకు డీటీపీ3 టీకాలు ఇచ్చే ప్రక్రియ మెరుగ్గానే ఉన్నది. డీటీపీ3 టీకా ఇవ్వని కారణంగా పెద్దమొత్తంలో చిన్నారులు అనారోగ్యంపాలైతే, ఇప్పటికే కుదేలైన ఆరోగ్య వ్యవస్థపై అదనపు భారం పడినట్టే. -కేథరిన్ రసెల్, యూనిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్