వాషింగ్టన్ డీసీ, ఏప్రిల్ 1 : భారత్పై ప్రతీకార సుంకాలకు సమయం ఆసన్నమైందని శ్వేతసౌధం ప్రకటించింది. అమెరికా వస్తువులపై సుంకాలు విధిస్తున్న దేశాలపై అమెరికా విధించనున్న ప్రతీకార సుంకాలు ఏప్రిల్ 2(బుధవారం) నుంచి అమలులోకి రానున్నాయి. అన్యాయంగా సుంకాలు విధిస్తూ అమెరికా ఎగుమతుదారులను దారుణంగా దెబ్బతీస్తున్న దేశాలలో భారత్ కూడా ఉందని ట్రంప్ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. అమెరికా వ్యవసాయ ఎగుమతులపై భారత్ 100 శాతం సుంకాన్ని విధిస్తోందని, కొన్ని విదేశీ మార్కెట్లను చేరుకోవడానికి అమెరికా వస్తువులకు సాధ్యపడడం లేదని వైట్ హౌస్ సెక్రటరీ కారోలిన్ లీవిట్ పేర్కొన్నారు. ఈ దేశాలు అమెరికాను చాలా ఏళ్లుగా పీల్చి పిప్పి చేస్తున్నాయని ఆమె ఆరోపించారు. అమెరికన్ కార్మికుల పట్ల తమ వ్యతిరేకతను ఈ చర్యలు స్పష్టంగా చూపుతున్నాయని ఆమె తెలిపారు. ప్రతీకారానికి సమయం ఆసన్నమైందని ఆమె ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు చారిత్రాత్మక మార్పులు తీసుకురానున్నారని, బుధవారం అది జరుగుతుందని లీవిట్ తెలిపారు. ఇదిలా ఉండగా, అమెరికా ప్రతీకార సుంకాలు ఏప్రిల్ 2న అమలులోకి వచ్చిన తర్వాత ఆ దేశ వస్తువులపై భారత్ కూడా గణనీయంగా సుంకాలు తగ్గిస్తుందని ట్రంప్ సోమవారం వెల్లడించారు. అమెరికన్ కార్లపై 2.5 శాతం సుంకాన్ని తగ్గిస్తున్నట్టు యూరోపియన్ యూనియన్ రెండు రోజుల క్రితం ప్రకటించిందన్న సంగతి ట్రంప్ గుర్తుచేశారు.
అమెరికా ప్రతీకార సుంకాల్ని విధిస్తున్నవేళ, భారతీయ వస్తువులు మరిన్ని కొనుగోలు చేసేందుకు చైనా సిద్ధమని చైనా రాయబారి యూ ఫీహాంగ్ వెల్లడించారు. వాణిజ్యం, ఇతర రంగాలలో ఆచరణాత్మక సహకారాన్ని బలోపేతం చేసుకునేందుకు భారత్తో కలసి పనిచేసేందుకు చైనా సిద్ధమని ఆయన చెప్పారు. చైనా మార్కెట్కు అనుకూలంగా ఉండే మరిన్ని భారత వస్తువులను దిగుమతి చేసుకుంటామని అన్నారు.