Pakistan Economic Crisis | దాయాది దేశం పాకిస్థాన్ గత కొన్ని రోజులుగా తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఆ దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో అక్కడ ఏది కొనాలన్నా తలకు మించిన భారం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు.
మనకు నిత్యం ఉపయోగపడే పాల నుంచి.. చికెన్ వరకు అన్ని ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రస్తుతం అక్కడ లీటరు లూజ్ పాల ధరలు రూ.190 నుంచి రూ.210కి ఎగబాకాయి. ఇక లైవ్ బ్రాయిలర్ చికెన్ గత రెండు రోజుల్లో కిలోపై రూ.30-40 పెరిగింది. దీంతో కొన్ని ప్రాంతాల్లో చికెన్ కిలో రూ.480-రూ.500 కాగా, మరికొన్ని ప్రాంతాల్లో రూ.700-రూ.780 వరకు పలుకుతున్నట్లు ప్రముఖ వార్తాపత్రిక డాన్ నివేదించింది.
కరాచీలో మొన్నటివరకూ రూ.620-రూ650గా ఉన్న కిలో చికెన్ ధరలు.. తాజాగా రూ.780కి చేరుకుంది. రావల్పిండి, ఇస్లామాబాద్ లాంటి కొన్ని నగరాల్లోనూ చికెన్ ధర ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరింది. కిలో కోడి మాంసం 700-780 రూపాయలకు అమ్ముడవుతోంది. ఇక బోన్లెస్ చికెన్ ధర కిలోకు రూ.1,000-1,100కి చేరింది.
చికెన్ ధరలు అనూహ్యంగా పెరిగాయని సింధ్ పౌల్ట్రీ హోల్సేలర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ(Sindh Poultry Wholesalers Association) కమల్ అక్తర్ సిద్ధిఖీ చెప్పారు. చికెన్ ధరలు పెరగడానికి ఆర్థిక సంక్షోభంతో పాటు ఫీడ్ కొరత కారణంగా అనేక పౌల్ట్రీ వ్యాపారాలు మూసివేయడమే ప్రధాన కారణమని తెలుస్తోంది. రోజురోజుకూ అమాంతం పెరిగిపోతున్న ఈ ధరలు చూసి చికెన్ ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.