Imran Khan | పాకిస్థాన్ ఎన్నికల్లో ఆర్మీ రిగ్గింగ్ కు పాల్పడిందని మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సారధ్యంలోని పాకిస్థాన్ తెహ్రీక్ ఈ-ఇన్సాఫ్ (పీటీఐ) ఆరోపించింది. పాకిస్థాన్ జనరల్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సారధ్యంలోని పాకిస్థాన్ ముస్లింలీగ్ -ఎన్ విజయం సాధించినట్లు వార్తలొచ్చాయి. దీంతో పాక్ ఆర్మీ తమను ఓడించేందుకు రిగ్గింగ్ కు పాల్పడిందని పీటీఐ ఆరోపించింది. ‘బ్యాట్ సింబల్ కోల్పోయినా ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు విజయం సాధించారు. పాక్ ఆర్మీ రిగ్గింగ్ చేస్తున్న వీడియో ఆధారాలు మా వద్ద ఉన్నాయి’ అని అంటూ ఓ పీటీఐ సభ్యుడు తెలిపారు.
గురువారం రాత్రి నుంచి పాక్ జాతీయ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. ప్రారంభంలో పీటీఐ అభ్యర్థులు ఆధిక్యం ప్రదర్శిస్తున్నారని వార్తలొచ్చాయి. పీటీఐ విజయాన్ని పాక్ ఆర్మీకి తాము గెలవడం ఇష్టం లేదని ఓ వ్యక్తి తెలిపారు. ‘గత రాత్రి వరకు మేం మెజారిటీ స్థానాలు గెలుస్తున్నాం అనుకున్నాం, కానీ పాక్ ఆర్మీ నిరాశతో మమ్ముల్ని గెలవకుండా చూస్తుంది’ అని పేర్కొన్నారు.
పాక్ ఆర్మీకి వ్యతిరేకంగా పీటీఐ మద్దతుదారులు ఆందోళనకు దిగడంతో సైనికులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పలువురు పీటీఐ కార్యకర్తలు మరణించారు. పాకిస్థాన్ జనరల్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో నవాజ్ షరీఫ్ సారధ్యంలోని పాకిస్థాన్ ముస్లింలీగ్ (నవాజ్) (పీఎంఎల్-ఎన్) అతిపెద్ద పార్టీగా అవతరించినట్లు తెలుస్తున్నది. కానీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 134 స్థానాలను గెలుచుకోలేకపోయింది.