న్యూఢిల్లీ: ప్రధాని పదవి నుంచి దిగిపొమ్మని ఒత్తిడి తీసుకొస్తే తాను మరింత ప్రమాదకారినవుతానని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రతిపక్షాలను హెచ్చరించారు. ఇమ్రాన్ ఖాన్ మిలిటరీ చేతిలో కీలుబొమ్మగా మారారని, ఆర్మీ సహకారంతో ఆయన అక్రమంగా గద్దెనెక్కారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆయన తక్షణమే పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఈ మేరకు ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి పీడీఎం కూటమిగా ఏర్పడ్డాయి. ఈ కూటమి ఇమ్రాన్ ఖాన్ పదవి నుంచి దిగిపోవాలంటూ ఈ ఏడాది మార్చిలో లాంగ్మార్చ్ నిర్వహించతలపెట్టింది. దీనిపై ఇమ్రాన్ ఖాన్ ఘాటుగా స్పందించారు. ప్రతిపక్షాలు నిర్వహించతలపెట్టిన లాంగ్మార్చ్ విఫలమవుతుందని జోస్యం చెప్పారు. తాను వీధుల్లోకి వస్తే ప్రతిపక్షాలకు దాక్కునేందుకు చోటు కూడా దొరకదని హెచ్చరిక జారీ చేశారు.
ప్రతిపక్ష నేత షెబాజ్ షరీఫ్ తనకు జాతిద్రోహిగా కనిపిస్తున్నారని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. షరీఫ్ కుటుంబం మొత్తం మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ బాటలోనే లండన్ పారిపోకతప్పదన్నారు. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయాలనుకుంటున్నాయని, అందుకు తాను అవకాశం ఇవ్వనని చెప్పారు. కాగా, ఇమ్రాన్ బెదిరింపులకు భయపడబోమని, ఆయన గద్దె దించేవరకు తాము పోరాడుతామని ప్రతిపక్షాలు తెగేసి చెబుతున్నాయి.