దాయాది మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత ప్రభుత్వాన్ని తెగ మెచ్చుకున్నారు. పెట్రో, డీజిల్ పన్నులను కేంద్రం తగ్గించిన నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా ఇమ్రాన్ ప్రశంసించారు. అమెరికా ఒత్తిళ్లు ఉన్నప్పటికీ.. వాటిని బేఖాతర్ చేసిందన్నారు. ఇలా అమెరికాను పక్కనబెట్టి, దేశ ప్రజలకు రిలీఫ్ ఇవ్వడానికి రష్యా నుంచి తక్కువ ధరకే చమురును కొనుగోలు చేసిందన్నారు.
క్వాద్ దేశాల్లో భారత్ సభ్య దేశమని, అయినా.. అగ్రరాజ్యం ఒత్తిడిని భారత్ తట్టుకొని నిలబడిందని పేర్కొన్నారు. దేశానికి రిలీఫ్ ఇవ్వడానికే ఇలా చేసిందన్నారు. భారత దేశానికంటూ ఓ స్వతంత్రమైన విదేశీ విధానం ఉండటం వల్లే ఇది సాధ్యమైందని వివరించారు. తాను ప్రభుత్వంలో ఉన్న సమయంలో ప్రత్యేక విదేశాంగ విధానం కోసం ప్రయత్నించానని, కానీ.. విదేశీ శక్తుల ప్రోద్బలంతో కొందరు అడ్డుకున్నారని పరోక్షంగా ప్రస్తుత ప్రధానిపై ఇమ్రాన్ విరుచుకుపడ్డారు.
పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ పన్నును కేంద్రప్రభుత్వం తగ్గించింది. పెట్రోల్పై రూ.8, డీజిల్పై 6 తగ్గిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ట్వీట్ చేశారు. మొత్తంగా పెట్రోల్పై రూ.9.5, డీజిల్పై రూ.7 తగ్గనున్నదని తెలిపారు. వంటగ్యాస్ సిలిండర్పై రూ.200 సబ్సిడీ ఇస్తున్నట్టు ప్రకటించారు. అయితే, ఇది ప్రధాన్మంత్రి ఉజ్వల్ కల్యాణ్ యోజన వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుందని, ఈ సబ్సిడీని వినియోగదారుల బ్యాంకు ఖాతాలో నేరుగా జమచేస్తామని వెల్లడించారు. కేంద్రప్రభుత్వం నిరుపేద మహిళలకు ఉజ్వల్ కల్యాణ్ యోజన కింద ఉచితంగా వంటగ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నది.