ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, భారత్ను మరోసారి కొనియాడారు. భారత విదేశాంగ విధానంపై ప్రశంసలు కురిపించారు. శనివారం లాహోర్లో జరిగిన భారీ బహిరంగ సభలో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడారు. అమెరికా ఒత్తిడికి తలొగ్గని భారత విదేశాంగ విధానాన్ని ఆయన ప్రస్తావించారు. స్లోవేకియాలో జరిగిన బ్రాటిస్లావా ఫోరమ్లో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడిన వీడియో క్లిప్ను కూడా ఆయన ప్లే చేశారు. రష్యా నుంచి చౌకగా చమురు కొనుగోలు చేయడంపై అమెరికా ఒత్తిడిని ఆయన ధీటుగా ఎదుర్కొన్నారంటూ ప్రశంసించారు. స్వతంత్ర దేశమంటే ఇదే అంటూ ఇండియాను పొగిడారు.
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం తీరుపై ఇమ్రాన్ ఖాన్ మండిపడ్డారు. ‘పాకిస్థాన్తోపాటే భారత్ స్వాతంత్ర్యం పొందింది. అయితే న్యూఢిల్లీ దృఢమైన వైఖరి తీసుకుంది. ఆ దేశ ప్రజల అవసరాలకు అనుగుణంగా విదేశాంగ విధానాన్ని రూపొందించుకుంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయెద్దని భారత్ను అమెరికా ఒత్తిడి చేసింది. అప్పుడు భారత విదేశాంగ మంత్రి ఏం చెప్పారో చూద్దాం’ అంటూ జైశంకర్ మాట్లాడిన వీడియో క్లిప్ను ఆయన ప్లే చేశారు.
‘రష్యా నుంచి చమురు కొనవద్దని అనడానికి నువ్వెవరు?’ అని అమెరికాను జైశంకర్ ప్రశ్నించారంటూ ఇమ్రాన్ ఖాన్ ప్రశంసించారు. రష్యా గ్యాస్ను యూరప్ కొంటున్నప్పుడు, భారత దేశ ప్రజల అవసరాల కోసం రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే తప్పేంటని జైశంకర్ సమాధానమిచ్చారంటూ కొనియాడారు. స్వతంత్ర దేశం అంటే ఇదే (యే హోతీ హై ఆజాద్ హకుమత్) అంటూ భారత్ను ఆయన ప్రశంసించారు.
మరోవైపు రష్యా చమురు కొనుగోలుపై అమెరికా ఒత్తిడికి షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై తలొగ్గిందంటూ ఇమ్రాన్ ఖాన్ మండిపడ్డారు. తాము అధికారంలో ఉన్నప్పుడు చౌకగా చమురు కొనుగోలు కోసం రష్యాతో మాట్లాడినట్లు చెప్పారు. అయితే అమెరికా ఒత్తిడికి నో చెప్పే ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. ‘దేశంలో ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రజలు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారు. ఈ బానిసత్వానికి నేను వ్యతిరేకం’ అని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు.
కాగా, 75 ఏళ్ల స్వతంత్ర వేడుకలను భారత్, పాకిస్థాన్ జరుపుకుంటున్న వేళ భారత్ను కొనియాడుతూ ఇమ్రాన్ ఖాన్ మాట్లాడిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.