Imran Khan | పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ అధ్యక్షుడు, పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై బుధవారం హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. నిరసన ప్రదర్శనకు కంటెయినర్లో వెళ్తుండగా గుర్తుతెలియని దుండగుడు జరిపిన కాల్పుల్లో ఆయన గాయపడ్డారు. వైద్యులు శస్త్ర చికిత్స చేయడంతో ప్రస్తుతం కోలుకుంటన్నారు. హత్యాయత్నం తర్వాత ఇమ్రాన్ తొలిసారి ప్రజల ముందుకొచ్చారు.
ఆసుపత్రిలో వీల్ఛైర్లో కూర్చొని తనపై జరిగిన దాడి గురించి మాట్లాడారు. కుడి కాలికి నాలుగు తూటాలు తగిలినట్టు చెప్పారు. దాడి జరుగుతుందని తనకు ముందే సమాచారం ఉందన్నారు. వజీరాబాద్, గుజరాత్లో తనను చంపేందుకు పథకం రచించినట్లు ముందు రోజే తెలిసిందన్నారు. పంజాబ్ మాజీ గవర్నర్ సల్మాన్ తసీర్ను చంపినట్టే తనను కూడా హత్య చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేసిందని ఆరోపించారు.
దేశంలో ముందస్తు ఎన్నికలు జరపాలన్న డిమాండ్తో పాక్ పంజాబ్లోని వజీరాబాద్ అల్లావాలాచౌక్లో లాంగ్మార్చ్ నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ర్యాలీలో ప్రజలనుద్దేశించి ప్రసింగించేందుకు ఇమ్రాన్ కంటెయినర్పైకి ఎక్కి నిలబడిన సమయంలో.. ఓ దుండగుడు ఇమ్రాన్పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆయన కాలికి గాయాలయ్యాయి.