వాషింగ్టన్, జూలై 16: తమ దేశంలోకి అక్రమ వలసకు సంబంధించి అమెరికా సరిహద్దు గస్తీ ఏజెన్సీ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ ఫోర్స్(సీబీపీ) సంచలన విషయాలు వెల్లడించింది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో కెనడా నుంచి 10,562 మంది భారతీయ వలసదారులు అక్రమంగా తమ దేశంలోకి ప్రవేశించారని డాటాలో పేర్కొన్నది. కాలిఫోర్నియాలో నివసిస్తున్న రాజిందర్ పాల్ సింగ్ అనే వ్యక్తి అరెస్టు నేపథ్యంలో ఈ అక్రమ వలసల విషయం వెలుగులోకి వచ్చింది. కెనడాలో నివసిస్తున్న పలువురు భారతీయ వలసదారులను రాజిందర్ సింగ్ అమెరికాలోని సియాటల్కు అక్రమంగా తీసుకెళ్లారని అధికారులు పేర్కొన్నారు. రాజిందర్ 90 సార్లకు పైగా ఉబెర్ ట్రిప్పుల ద్వారా 360 మందిని సరిహద్దు దాటించాడని, ఈ బుకింగ్లు అన్ని ఒకే అకౌంట్ నుంచి చేసుకున్నట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. కరోనా లాక్డౌన్ అనంతరం పరిస్థితులు, కెనడాలో ఉపాధి అవకాశాలు లేని నేపథ్యంలో సామూహిక వలసలు చోటుచేసుకున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఉత్తర సరిహద్దు ప్రాంతాల్లో సీబీపీ అధికారులు దాదాపు 1,200 మంది భారతీయులను పట్టుకున్నారు. సరిహద్దు దాటించేందుకు అక్రమ రవాణాదారులు వేలకొద్దీ డాలర్లు చార్జి చేశారని ఆ వర్గాలు తెలిపాయి. దూరాన్ని బట్టి 30 వేల నుంచి 70 వేల డాలర్ల వరకు కోరేవారని అధికారులు తెలిపారు. ఇందులో రవాణా ఖర్చులు, ఫేక్ డాక్యుమెంట్లు ఖర్చు ఉంటాయి. రాజిందర్ సింగ్ కెనడా నుంచి అమెరికా తీసుకుపోయేందుకు 11,500 డాలర్లు చార్జి చేసేవారని, రవాణాకు అతను పలు అకౌంట్లు మెయింటెన్ చేసే వాడని తెలిపారు. దర్యాప్తు అధికారులకు ఉబెర్ ఇచ్చిన సమాచారంలో అధికారులకు కీలక విషయాలు తెలిశాయి. ట్రిప్పు ప్రారంభమైన ప్రాంతం తెలియకుండా ఉండేందుకు మానవ అక్రమ రవాణాదారులు ట్రిప్పులు పంచుకునేవారని అధికారులు గుర్తించారు. ఈ ట్రిప్పులకు బ్రోకర్లు ఏర్పాట్లు చేసే వారని, అందుకు 2,500 నుంచి 5 వేల డాలర్లు తీసుకునేవారని దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఏడాది మొదట్లో కెనడా-అమెరికా సరిహద్దు ప్రాంతం మనిటోబాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు భారతీయులు మరణించిన విషయం తెలిసిందే.
కెనడా టు అమెరికా అక్రమ వలసలు
2022 మొదటి ఆర్నెల్లలో.. 10,562 అక్రమంగా ప్రవేశించారు
1,200 ఉత్తర సరిహద్దు ప్రాంతాల్లో పట్టుబడినవారు
రవాణాకు మొత్తం డీల్..$ 30,000 – 70,000 రవాణా, ఫేక్ డాక్యుమెంట్లు ఖర్చులు..
$ 2,500 – 5,000 బ్రోకర్ల ఫీజు
కెనడాలో ఉపాధి అవకాశాలలేమే
వలసలకు కారణం