వార్సా: పోలాండ్, బెలారస్ సరిహద్దులు ఉద్రిక్తంగా మారాయి. బెలారస్ నుంచి శరణార్థులు.. బోర్డర్ మీదుగా పోలాండ్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొన్నది. శరణార్థులు పోలాండ్ మీదుగా యురోపియన్ యూనియన్ దేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. రెండు దేశాల సరిహద్దుల్లో.. అత్యల్ప ఉష్ణోగ్రతల నడుమ శరణార్థులు వేచి చూస్తున్నట్లు పోలాండ్ ప్రధాని తెలిపారు. తమ దేశంలోకి శరణార్థులు చొరబడే విధంగా బెలారస్ ప్రయత్నిస్తోందని పోలాండ్ ఆరోపిస్తున్నది. బోర్డర్ వద్ద సైనిక చర్య తప్పేటట్టులేదని పోలాండ్ వార్నింగ్ ఇచ్చింది. ప్రస్తుతం సరిహద్దు వద్ద పోలాండ్ అదనపు బలగాలను మోహరించింది. ఇనుప వైర్ను దాటి వెళ్లేందుకు శరణార్థులు ప్రయత్నిస్తున్నారు.
బెలారస్ తమ దేశంలోని ప్రజల్ని రెచ్చగొట్టి .. సమస్యను సృష్టిస్తోందని పోలాండ్, ఈయూ, నాటో పేర్కొంటున్నాయి. కుజ్నికా వద్ద ఉన్న బోర్డర్ క్రాసింగ్ను మూసివేస్తున్నట్లు పోలాండ్ ప్రకటించింది. పోలాండ్, లుథివేనియా, లాత్వియా దేశాలకు అక్రమంగా బెలారస్ నుంచి వలస వస్తున్న వారి సంఖ్య పెరిగింది. వీరిలో చాలా మంది మధ్యప్రాశ్చ్య, ఆసియా దేశాలకు చెందినట్లు తెలుస్తోది. బోర్డర్ వద్ద సుమారు నాలుగు వేల మంది పోలాండ్లోకి ఎంటరయ్యేందు చూస్తున్నారు. బెలారస్పై విధించిన ఆంక్షలకు ప్రతీకారంగా శరణార్థులను ఆ దేశాధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో రెచ్చగొడుతున్నట్లు ఈయు ఆరోపిస్తున్నది. బెలారస్ అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో సామూహిక నిరసనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఆ ఆందోళనలను లుకషెంకో దారుణంగా అణిచివేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈయూ దేశాలు బెలారస్పై ఆంక్షలు విధించాయి.