న్యూఢిల్లీ, జూన్ 9: మనిషి గరిష్ఠ జీవిత కాలం ఎంత? ఈ ప్రశ్న ఎన్నో వందల ఏండ్లుగా జీవ శాస్త్రవేత్తల మదిని తొలిచేస్తున్నది. సాధారణంగా అందరూ అనుకొనేది ఏంటంటే మానవుడి సంపూర్ణ అయుష్షు 100 ఏండ్లు అని. కానీ వందేండ్లకు మించి బతికిన వారు ఎంతో మంది ఉన్నారు. మనిషి 140 ఏండ్ల దాకా బతకగలడని గతంలో శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. ఇప్పుడు అది 150 ఏండ్లకు పెరిగింది. జన్యుక్రమం, మంచి ఆహారం, వ్యాయామంతో పాటు వృద్ధాప్యంలో ఇచ్చే ఔషధాల్లో మార్పులతో మనిషి 150 ఏండ్ల వయసు వచ్చేదాక జీవించగలడని అమెరికా, సింగపూర్, రష్యా శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. వ్యాధి నుంచి కోలుకోవడానికి, ఆయుర్దాయానికి మధ్య సంబంధం ఉందని వారు తెలిపారు. వ్యాధుల నుంచి త్వరగా కోలుకొనేవారు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉందన్నారు. వృద్ధాప్యంలో మనుషుల అవయవాల పనితీరుపై పరిశోధనలు ఎక్కువగా జరగలేదని, పరిశోధనలు నిర్వహించి వారు త్వరగా కోలుకొనేలా ఔషధాల్లో మార్పులు చేస్తే ఆయుర్దాయం పెరుగుతుందని చెప్పారు.
కంప్యూటర్ మోడలింగ్తో అధ్యయనం
శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో భాగంగా కంప్యూటర్ మోడలింగ్ సాయం తీసుకొన్నారు. 85 ఏండ్ల వయస్సు దాటిన 70 వేల మందికి రక్త పరీక్షలు చేశారు. ఎర్రరక్తకణాలు, తెల్ల రక్తకణాల సంఖ్య ఆధారంగా శరీరంలో అవయవాల పనితీరును అంచనా వేశారు. తెల్లరక్తకణాలు ఎక్కువ ఉంటే వ్యాధి నిరోధకత ఎక్కువ ఉన్నట్టు. ఎర్ర రక్తకణాలు ఎక్కువ ఉంటే కొన్ని రకాలైన వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ. కంప్యూటర్ మోడలింగ్లో శాస్త్రవేత్తలు ఈ రెండు రకాల కణాల సంఖ్యను సమన్వయం చేశారు. వయస్సును బట్టి వాటిలో జరిగే మార్పుల ప్రభావం అవయవాల పనితీరుపై ఎలా ఉంటుందన్నదానిపై అంచనా వేశారు. మనిషి గరిష్ఠంగా 150 ఏండ్లు జీవించగలడని ఈ మోడల్ సూచించింది.
జీవిత కాలం లెక్కింపు
గాంపెర్ట్ ఈక్వేషన్తో సగటు ఆయుర్దాయాన్ని లెక్కిస్తారు. ఇది వ్యాధులు-మరణాల రేటు ఆధారంగా ఉంటుంది. ఆయుర్దాయాన్ని మొదటిసారిగా 19వ శతాబ్దంలో లెక్కించారు. అవయవాల పనితీరుతో కూడా ఆయుర్దాయాన్ని అంచనా వేస్తారు. వయస్సుతో పాటు అవయవాల పనితీరు కూడా తగ్గుతుంది. క్రమంగా మనిషి మరణానికి చేరువవుతాడు. ఎక్కువ కాలం జీవించిన మనిషిగా రికార్డు జీయాన్నే కాలామెట్ పేరిట ఉంది. ఆమె 122 ఏండ్లు జీవించారు. ఆమె 1875లో జన్మించారు.