భోపాల్ : మధ్యప్రదేశ్లో కరోనా ఉధృతి రోజురోజుకూ పెరుగుతుండటంతో వైరస్ కట్టడికి ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. జన సంచారాన్ని నిరోధించేందుకు రాష్ట్ర సరిహద్దులన్నింటినీ మూసివేయాలని యోచిస్తున్నది.
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అంతర్రాష్ట్ర సరిహద్దులు మూసివేసేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నదని ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి నరోత్తమ్ మిశ్రా గురువారం రాత్రి తెలిపారు.
ప్రజల అంతర్రాష్ట్ర ప్రయాణాల కారణంగా కరోనా కట్టడికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఆశించిన మేర ఫలితం ఇవ్వడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
పక్కనే ఉన్న ఉత్తరప్రదేశ్లోనూ కరోనా తీవ్రత పెరుగుతుండటంతో మే 7 వరకు అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిలిపివేసింది. మధ్యప్రదేశ్తో ఐదు రాష్ట్రాలు సరిహద్దును పంచుకుంటున్నాయి.
వీటిలో మహారాష్ట్ర, ఛత్తీస్ఘఢ్ రాష్ట్రాలు కూడా ఉండగా.. దేశంలో కరోనాతో అత్యధికంగా ప్రభావితవుతున్న 10 రాష్ట్రాల్లో ఈ రెండు రాష్ట్రాలు సైతం ఉన్నాయి.
మధ్యప్రదేశ్లో గురువారం ఒక్కరోజే 12,762 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 95 మంది ప్రాణాలు కోల్పోయారు. పాజిటివ్ కేసులు 5.5 లక్షలకు పెరిగాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.