న్యూఢిల్లీ, జూలై 10: శ్రీలంకలో ఉద్యమకారులు ఏమాత్రం వెనక్కు తగ్గటంలేదు. శనివారం అధ్యక్ష భవనాన్ని ఆక్రమించి, ప్రధాని ప్రైవేటు నివాసాన్ని తగులబెట్టిన తర్వాత కూడా అక్కడే మకాం వేశారు. అధ్యక్షుడు గొటబయ రాజపక్స, ప్రధాని రణిల్ విక్రమసింఘే పదవులకు రాజీనామా చేసేవరకు అధ్యక్ష భవనాన్ని ఖాళీ చేసే ప్రసక్తే లేదని ఆదివారం స్పష్టంచేశారు. అధ్యక్ష భవనంలో కోట్లకొద్దీ డబ్బును గుర్తించి, భద్రతా బలగాలకు అప్పగించినట్టు ప్రకటించారు. మరోవైపు దేశంలో శాంతిని నెలకొల్పేందుకు సైన్యానికి, పోలీసులకు సహకరించాలని ప్రజలకు శ్రీలంక సైన్యాధ్యక్షుడు శివేంద్ర సిల్వ పిలుపునిచ్చారు. సంక్షోభాన్ని శాంతియుతంగా పరిష్కరించే అవకాశం వచ్చిందని, దానిని సద్వినియోగం చేసుకొందామని సూచించారు. మరోవైపు, లంక తాజా సంక్షోభంపై భారత్ స్పందించింది. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, శ్రీలంక ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని భారత విదేశాంగశాఖ ప్రకటించింది.
వెనక్కి వెళ్లిపోండి
దేశంలో శాంతిని నెలకొల్పేందుకు సహకరించాలని సైన్యాధ్యక్షుడు శివేంద్ర సిల్వ పిలుపునిచ్చారు. నిరసనకారులు వెనక్కి వెళ్లిపోవాలని కోరారు. భద్రతా బలగాలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, అధ్యక్ష భవనాన్ని ఆక్రమించిన నిరసనకారులు, అందులోని అణువణువూ గాలిస్తున్నారు. ఆదివారం కోట్లకొద్ది డబ్బును గుర్తించినట్టు ప్రకటించారు. డబ్బును లెక్కపెడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ప్రతిపక్ష ఉమ్మడి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు
అధ్యక్ష, ప్రధాని పదవులు ఖాళీ కావటంతో దేశాన్ని నడిపించేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ ఒక్కటవుతున్నాయి. ఆదివారం సమావేశమైన పలు పార్టీల నేతలు, ప్రతిపక్ష ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి ఆ తర్వాత పదవి నుంచి తప్పుకోవాలని అధ్యక్షుడు గొటబయ రాజపక్సకు ప్రతిపక్ష నేత ఎంఏ సుమంతిరన్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు 113 మంది ఎంపీలు అవసరం కాగా, విపక్షాలన్నీ కలిస్తే మెజారిటీ మార్కు లభిస్తుంది.
అజ్ఞాతం నుంచే ఆదేశాలు
ప్రజా ఉద్యమానికి భయపడి అధ్యక్ష భవనం విడిచి పారిపోయిన అధ్యక్షుడు గొటబయ రాజపక్స ఎక్కడున్నారన్నదానిపై అధికార యంత్రాంగం గోప్యత పాటిస్తున్నది. అయితే, ఆయన అజ్ఞాతంలో ఉంటూనే ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు. పార్లమెంటు స్పీకర్ మహింద యాప అభయ్వర్ధనేతో మాత్రమే అధ్యక్షుడు టచ్లో ఉన్నారు. ప్రజలకు వంటగ్యాస్ సరఫరా చేయాలని అధ్యక్షుడు ఆదేశించినట్టు అధికారులు ఆదివారం తెలిపారు.
రంగంలోకి అజిత్ దోబాల్
శ్రీలంక పరిణామాలపై భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్ దృష్టిపెట్టినట్టు సమాచారం. భారత గూఢచారి సంస్థ రిసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా) ద్వారా కొలంబోలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకొంటున్నట్టు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. ముఖ్యంగా భారత్కు భద్రతాపరమైన సమస్యలు ఏమైనా వచ్చే ప్రమాదం ఉన్నదా? అన్నదానిపై దృష్టిపెట్టినట్టు సమాచారం. లంకలో ఆర్థిక సంక్షోభం మొదలైనప్పటి నుంచీ టన్నులకొద్దీ ఆహార ధాన్యాలతోపాటు చమురు, గ్యాస్ సరఫరా చేస్తూ వస్తున్న భారత్, తాజాగా శని, ఆదివారాల్లో జరిగిన పరిణామాలపై ఆందోళన చెందుతున్నట్టు తెలిసింది. దీర్ఘకాలంపాటు ప్రభుత్వం లేకపోతే అరాచకం ప్రబలే ప్రమాదం ఉండటంతో వీలైనంత త్వరగా కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు తనవంతు సహకారం అందించాలని ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. క్రెడిట్లైన్ ద్వారా శ్రీలంకకు ఇప్పటికే భారత్ 3.5 బిలియన్ డాలర్ల సాయం అందించింది.
భారత్ వ్యూహాత్మక వైఖరి (ఢిల్లీ నుంచి ప్రత్యేక ప్రతినిధి)
శ్రీలంక పరిణామాలపై భారత్ ఆచి తూచి వ్యవహరిస్తున్నది. పరిస్థితులను నిశితంగా పరిశీలి స్తున్నట్టు విదేశాంగశాఖ వర్గాలు తెలిపాయి.