America | వాషింగ్టన్, ఫిబ్రవరి 26: అమెరికా పౌరసత్వాన్ని పొందాలని ఆశిస్తున్న సంపన్న విదేశీ వలసదారుల కోసం ఓ కొత్త పథకాన్ని తీసుకురానున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. గోల్డ్ కార్డులను కొనుగోలు చేయడం ద్వారా అమెరికా పౌరసత్వాన్ని సులభంగా పొందే అవకాశాన్ని కల్పించాలని భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. 5 మిలియన్ డాలర్లకు(సుమారు రూ.44 కోట్లు) గోల్డ్ కార్డులను విక్రయించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ గోల్డ్ కార్డులు గ్రీన్ కార్డు నివాసంతో సమానమని, విదేశీయులు అమెరికన్ పౌరసత్వాన్ని పొందడానికి ఇది మార్గమని ట్రంప్ ప్రకటించారు.
సుమారు 1 కోటి గోల్డ్ కార్డులను విక్రయిస్తామని ఆయన తెలిపారు. ఈ పథకం వల్ల దేశం ఎదుర్కొంటున్న రుణ భారం తొలగిపోతుందని ఆశిస్తున్నట్టు ఆయన చెప్పారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఈబీ-5 ఇమిగ్రెంట్ ఇన్వెస్టర్ వీసా ప్రోగ్రామ్ స్థానంలో గోల్డ్ కార్డులు వస్తాయని ఆయన వివరించారు. ఈబీ-5 వీసా కార్యక్రమం ద్వారా విదేశీ పెట్టుబడిదారులు తమ డబ్బును అమెరికాలో పెట్టుబడి పట్డడం ద్వారా ఉద్యోగాలు పొందడంతోపాటు ఉద్యోగలను సృష్టించవచ్చు.
అంతేగాక శాశ్వత నివాస హోదాను కూడా పొందవచ్చు. అమెరికన్ వ్యాపారాలలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చే విదేశీ సంపన్నులకు ఈబీ-5 ప్రోగ్రామ్ కింద గ్రీన్ కార్డులను ప్రసాదిస్తారు. కాగా, ఈ ప్రోగ్రామ్ను రద్దు చేసి గోల్డ్ కార్డుల విక్రయాన్ని ప్రారంభించనున్నట్టు ట్రంప్ ప్రకటించారు. గోల్డ్ కార్డులకు 5 మిలియన్ డాలర్ల చొప్పున వెల కడుతున్నామని ఆయన చెప్పారు. ఇది గ్రీన్ కార్డు అధికారాలు కల్పించడంతోపాటు అమెరికా పౌరసత్వాన్ని పొందేందుకు దారి కాగలదని ఆయన తెలిపారు. మరో రెండు వారాలలో ఈ పథకానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడిస్తామని ట్రంప్ తెలిపారు.
అమెరికన్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ తీసుకువచ్చిన ఈబీ-5 ఇమిగ్రెంట్ ఇన్వెస్టర్ ప్రోగ్రామ్ను అమెరికన్ కాంగ్రెస్ 1990లో ఆమోదించింది. విదేశీ పెట్టుబడిదారుల ద్వారా ఉపాధి కల్పన, మూలధన పెట్టుబడులు రాబట్టి అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అమలులోకి తీసుకువచ్చింది. అయితే ఈ కార్యక్రమాన్ని అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ మంగళవారం విలేకరుల సమావేశంలో తీవ్రంగా దుయ్యబట్టారు.
సంపన్న విదేశీ పెట్టుబడిదారులను ఆకట్టుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా గోల్డ్ కార్డ్ ప్రకటన గ్రీన్ కార్డు కోసం ఎన్నో ఏళ్లుగా ఆశగా నిరీక్షిస్తున్న భారతీయ ప్రొషెషనల్స్ను మరింత నిరాశకు గురిచేసే అవకాశం కనపడుతోంది. అమెరికా రెసిడెన్సీ పొందేందుకు నేరుగా దారి చూపించే ఈ కొత్త పథకం భారతీయ కుబేరులు, వ్యాపార దిగ్గజాలకు మాత్రమే ఉపయోగపడే అవకాశం ఉంది. సుదీర్ఘ కాలంగా, కొన్ని సందర్బాలలో అనేక దశాబ్దాలుగా గ్రీన్ కార్డు కోసం వెయిటింగ్ లిస్టులో ఉన్న స్కిల్డ్ ప్రొఫెషనల్స్ కష్టాలు ఈ కొత్త పథకం వల్ల మరింత పెరిగే అవకాశం ఉంది. ఈబీ-5 కింద దరఖాస్తుదారులు రుణాలు తీసుకోవడం లేదా నిధులు సమీకరించుకోవడానికి అవకాశం ఉండగా గోల్డ్ కార్డులను నగదు చెల్లింపు ద్వారా మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సామాన్య, మధ్య తరగతి భారతీయులకు ఈ పథకం అందుబాటులో ఉండే అవకాశం ఏమాత్రం లేదు.