Nepali teacher : నేపాల్ ఆకస్మిక వరదల నుంచి 1,643 మంది పిల్లల్ని కాపాడారు ఒక స్కూల్ టీచర్ కం ప్రిన్సిపాల్. ఆయన సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్లే అంతమంది ప్రాణాలతో బయటపడగలిగారు. లేకుంటే.. ఆ వరదల్లో పిల్లలు, స్టాఫ్ అంతా కొట్టుకుపోయేవారు. ఇంతమంది ప్రాణాల్ని కాపాడిన ఆ ప్రిన్సిపాల్ సమయస్ఫూర్తిని ఇప్పుడు అందరూ ప్రశంసిస్తున్నారు. నేపాల్లో గత బుధవారం ఆకస్మిక వరదలు సంభవించిన సంగతి తెలిసిందే.
ఈ ఘటనలో అనేక ఊళ్లు కొట్టుకుపోయాయి. వందలాది మంది మరణించారు. రెండు వేల మందికిపైగా గల్లంతయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ప్రిన్సిపాల్ వరద హెచ్చరికను ముందుగా గుర్తించి, పిల్లల్ని రక్షించాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలివి. నేపాల్ త్రిశూలి వ్యాలీలోని త్రిశూలి సెకండరీ స్కూల్లో రాజేంద్ర దవాది ప్రిన్సిపాల్గా పని చేస్తున్నాడు. ఆయన ఇంగ్లీష్ టీచర్ కూడా. మూడంతస్తుల ఈ స్కూల్లో 1,643 మంది పిల్లలున్నారు. బుధవారం వరద వచ్చిన సమయంలో ఆయన స్కూల్లోనే ఉన్నారు.
ఈ ప్రాంతాన్ని వరద ముంచెత్తడానికి కొన్ని నిమిషాల ముందు.. ఉదయం 9.20 గంటల సమయంలో రాజేంద్రకు తన స్నేహితుడి నుంచి వరద గురించి వార్నింగ్ కాల్ వచ్చింది. అయితే, తమ స్కూల్ చాలా ఎత్తులో ఉందని, వరద వచ్చే అవకాశం లేదని ఆయన అంచనాకు వచ్చారు. పైగా బిల్డింగ్ కూడా చాలా బలంగా ఉందని నమ్మాడు. కానీ, అప్పుడే గ్రామంలోని మరో వ్యక్తి వచ్చి.. చుట్టూ వరద ముంచెత్తుతోందని, నీటి ప్రవాహం పెరుగుతోందని చెప్పాడు. వెంటనే అప్రమత్తమైన రాజేంద్ర స్కూల్ అలారం మోగించాడు.
పిల్లలందరినీ క్లాస్ రూంలలోంచి పంపించమని టీచర్లకు చెప్పాడు. ఇదే సమయంలో స్కూల్ బస్సు డ్రైవర్లను కూడా పిలిచాడు. బస్సులు తీసుకు రమ్మన్నాడు. కానీ, వరద కారణంగా బస్సులు రాలేకపోయాయి. వెంటనే విద్యార్థులందరినీ పక్కనే ఉన్న కొండపైకి ఎక్కమని చెప్పాడు. అక్కడి ఒక బోధి చెట్టు కింద అందరూ సురక్షితంగా తలదాచుకున్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే స్కూల్ బిల్డిండ్ వరదల్లో కొట్టుకుపోయింది. అంతమందిని కాపాడిన ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
స్కూల్ సోషల్ హిస్టరీ టీర్ సంతోస్ పరియార్ (32), మరో సిబ్బంది సుల్తాన్ లామా ఇద్దరు వరదల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. రాజేంద్ర సమయస్ఫూర్తితో వ్యవహరించకుంటే ఆ పిల్లల ప్రాణాలు కూడా వరదల్లో కొట్టుకుపోయేవి. ఇంతమందిని కాపాడిన ఆ టీచర్ను స్తానికులు ప్రశంసిస్తున్నారు.