న్యూఢిల్లీ: ఎర్ర సముద్రంలో (Red Sea) హౌతీ రెబెల్స్ దాడులు కొనసాగుతున్నాయి. వాణిజ్య నౌకలపై దాడులను వెంటనే ఆపాలని అమెరికా సహా దాని 12 మిత్ర దేశాలు హెచ్చరించాయి. అయితే వాటిని ఏ మాత్రం పట్టించుకుని హౌతీ రెబెల్స్ (Houthi Rebels) మరోసారి వాణిజ్య నౌకలపై దాడులకు దిగింది. పేలుడు పదార్థాల నిండిన డ్రోన్ పడవ పేలింది. అయితే దానివల్ల ఎలాంటి నష్టం జరుగలేదని యూఎస్ నేవీ తెలిపింది. కాగా, దాడులు ఆపకపోతే తీవ్రమైన చర్య ఉంటాయ అమెరికా ఫైనల్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే 24 గంటల వ్యవధిలోనే మరోదాడి జరగడం విశేషం.
పేలుడుకు ముందు మానవరహిత ఉపరితల నౌక (USV) యెమెన్ నుంచి అంతర్జాతీయ షిప్పింగ్ లైన్లలోకి వస్తుండగా దానిపై డ్రోన్లతో దాడి చేసిందని మిడిల్ ఈస్ట్లో యూఎస్ నావల్ ఫోర్సెస్ వైస్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ (Brad Cooper) అన్నారు. అయితే అది ఏ నౌకను లక్ష్యంగా చేసుకుందనే విషయంపై స్పష్టతనివ్వలేదు. కాగా, మరోవైపు హౌతీ దాడుల నేపథ్యంలో సరకు రవాణా చార్జీలు అమాంతం పెరిగాయి. దాడుల వల్ల ప్రస్తుతం కేప్ ఆఫ్ గుడ్ హోప్ గుండా వాణిజ్య నౌకలు ప్రయాణం చేస్తున్నాయి. దీంతో దూరం అధికమవడంతో రవాణా చార్జీలు కూడా అధికమయ్యాయి. ఫ్రాన్స్కు చెందిన సీఎంఏ-సీజీఎం సంస్థ చార్జీలను 100 శాతం పెంచడం గమనార్హం.