మైత్రేయ మహర్షి విదురునికి ఇలా వివరించాడు- బ్రహ్మపుత్రులు పద్మాపతి పద్మనాభుని
దివ్యమంగళ విగ్రహ వైభవాన్ని తనివితీర దర్శించి, పరవశించి పద్మరాగ నఖమణి
ప్రభలతో ప్రకాశించే స్వామి పాదపద్మాలను తమ హృదయ పీఠాలపై పదిల పరచుకొని పదే-పదే ప్రణామాలు చేశారు. పరి-పరి విధాల ప్రస్తుతించారు.
సనత్కుమారులు నారాయణుని నుతించిన స్తోత్రాన్ని భక్తకవి పోతన చంపకమాలా పద్యపంచకంతో భక్తిభావ పరిమళ భరితం చేశాడు. సంకీర్తనతో సంతుష్టుడైన ముకుందుడు ముని ముఖ్యులతో ఇలా ముచ్చటించాడు- ‘నా దౌవారికులు (ద్వారపాలకులు) మిమ్ములను వారించినందుకు మీరు వారికి తగిన శిక్ష విధించారు. ఇది నాకుకూడా సమ్మతమే. సేవకుల అపరాధం స్వామిదే కాన నన్ను మన్నించి నామీద దయ చూపండి. కాయం (దేహం)లో కుష్ఠువ్యాధి చేరడం చేత చర్మం చెడిపోయి రంగు మారినట్లు దాసుని తగని (కూడని) పని వలన యజమానికి యశోహాని (అపకీర్తి) కలుగుతుంది. మీ మహిమవల్లనే ఈ వైకుంఠానికి ఇంత గరిమ- గొప్పదనం చేకూరింది. సాధు సత్తములారా! మిమ్ములను బాధించేవారు నా హస్తముల (చేతుల) వంటివారైనా వారిని నరికి వేయడానికి నేను వెనుకాడను. ఇక ఇతరుల మ్రోల-మాట ఎన్న నేల? మహాత్ములారా! మీ వంటి మహీసురుల- బ్రాహ్మణుల పవిత్ర పాదపద్మ పరాగాన్ని భక్తితో నా నవరత్న ఖచిత సువర్ణ కిరీటాన ధరిస్తాను. మహర్షులారా! నా భృత్యులు ద్వారపాలురు కొద్దికాలంలోనే నా వద్దకు వచ్చి చేరునట్లు పెద్ద మనసుతో అనుమతించండి.’
నారాయణుని నర్మగర్భమైన మాటలు విని మునీశ్వరులు మొదట అచ్యుతుడు తమను (అభి) నందిస్తున్నాడో లేక నిందిస్తున్నాడో తెలుసుకోలేకపోయారు. తికమక పడ్డారు. అంతలోనే అనుగ్రహించాడని ఆకళించుకొని ఆనందంతో అంజలి ఘటించి, ఇలా అన్నారు- ‘స్వామీ! మా మతం- మేము చేసిన పని, ‘నాకు సమ్మతమే’ అని అన్నావు. నీ లీలలు తెలుసుకోవడం ఎవని తరం? చిన్మయ స్వరూపా! ఒక చిన్న విన్నపం. మాచే శపింపబడిన ఈ జయ-విజయులను నీవు ఇంకా కఠినంగా శిక్షింపదలచినా సరే! లేక ఇంకా ఎక్కువ సిరి సంపదలిచ్చి రక్షింపదలచినా సరే! కాక, మేమే అనుచితంగా పలికినట్లు భావించే యెడల మమ్ములను కూడా శాసించు’.
పంకజనాభుడు పరమాత్మ ప్రేమతో ఇలా పలికాడు- ‘ఓ పుణ్యాత్ములారా! ఈ ద్వారపాలురిద్దరూ ధరణిమీద లోభ, మోహాలు కలవారై ముమ్మారు దైత్యులై జన్మిస్తారు. లోక కంటకులై జీవిస్తూ అతి సాహసంతో వైరభక్తితో నన్నెదిరించి నాచే నిహతులై నన్ను చేరుకుంటారు. మునులారా! ఈ మూడు జన్మల తర్వాత వీరికిక జన్మలేదు’. భక్త పక్షపాతమే భగవంతుని స్వరూపం! తన భక్తుడు సనత్కుమారుల వంటి మహాత్ములను అవమానించినా- అదికూడా సాక్షాత్ వైకుంఠంలో, వైకుంఠుడు వానిని క్షమిస్తాడన్న రహస్యం ఈ సందర్భంగా బయటపడ్డది. జయ విజయులవి మూడు జన్మలే అయినా వారిని ఉద్ధరించడానికి విష్ణువు నాలుగు అవతారాలు ఎత్తాడు- వరాహ, నారసింహ, రామ, కృష్ణావతారాలు.
భక్త వత్సలుడైన భగవంతుడిలా భావించాడు- ‘నా భక్తుడు ఉగ్ర హిరణ్యకశిపుడైతే నేను ఉగ్రతర నరసింహ స్వామినవుతా!’ శ్రీహరి మనోభావం తెలిసి తనువులు పులకించగా సనకాదులు సంతసించి, స్వామిని సన్నుతించి శ్రీనివాసుని అనుమతితో తమ నివాసాలకు వెళ్లారు. అనంతరం జయ-విజయులు తేజస్సు కోల్పోయి వసుధపై వచ్చి పడ్డారు. వారే ఇప్పుడు దితి గర్భంలో ఉన్నారు.
తన బిడ్డలు దేవతలను బాధిస్తారని దితి బాధ పడుతోంది. ‘పూర్ణే వర్షశతే సాధ్వీ’- నిండా నూరేళ్లు నిండగా దితి సకల లోక కంటకులైన ఇద్దరు సుతులను కన్నది. వారు జన్మించే సమయంలో సంభవించిన భయంకరమైన అపశకునాలు, దుర్నిమిత్తాలు చూచి భువనాలు తల్లడిల్లినాయి. సర్వజ్ఞులైన సనకాది మహర్షులు మాత్రం చలించలేదు.
కశ్యపుడు దితి పుత్రులలో పెద్దవానికి ‘హిరణ్యకశిపుడు’ అనీ, చిన్నవానికి ‘హిరణ్యాక్షుడు’ అనీ మంచి మనస్సుతో సార్థకంగా, సాభిప్రాయంగా నామకరణం చేశాడు. ఇరువురి నామాలలో ‘హిరణ్య’ (బంగారం) అనే శబ్దం సమానంగా ఉంది. ‘హితం రమణం చ భవతి ఇతి హిరణ్యం’- లోకులకు హితకరము, రమణీయమైనది- అని అర్థం. ‘అక్షి’ అనగా కన్ను. హిరణ్యం మీద కన్ను పడ్డవాడు, కన్ను వేసిన వాడు హిరణ్యాక్షుడు. వాడి కంటికి డబ్బు- ధనం తప్ప మరేదీ కనిపించదు. దేవుడు లేడు, ధర్మం లేదు, ఆత్మ లేదు, పరమాత్మ లేడు, పాపభీతీ లేదు, పుణ్యరతీ లేదు, నీతీ లేదు, నియమమూ లేదు! ‘మాతా పుత్ర విరోధాయ హిరణ్యాయ నమోనమః’ (తల్లీ కొడుకుల మధ్యనే వైమనస్యం, విరోధం కల్గించే బంగారమా! నీకు నమస్కారం) అని అనుభవజ్ఞుల కథనం. పరమార్థంలో సంగ్రహ ప్రవృత్తి, లోభం లేక మమత్వ బుద్ధి- మమకారం; అంతా నాదే, నాకే అన్న స్వార్థపూరిత మనస్తత్తం. ధర్మ విరుద్ధమైన కామ భోగం వలన, నియమ నిష్ఠల లేమి వలన కలిగేది లోభం. ‘లాభాత్ లోభః’ ప్రవర్ధతే’- లాభం పెరిగే కొద్దీ లోభం కూడా పెరుగుతుంది. ఈ లోభమే పాప తాపాలకు మూలం.
‘కనకాక్షుండు భుజా విజృంభణమునన్ క్ష్మా చక్రముం జాప జుట్టిన మాడ్కిం గొని పోవ…’ హిరణ్యాక్షుడు పుట్టగానే భూమినంతా చాపగా చుట్టి దొంగిలించి రసాతలం (పాతాళం)లో దాచి పెట్టాడని కథ వినిపిస్తాడు విశాలబుద్ధి వేద వ్యాసుడు- ‘నమోస్తు తే వ్యాస విశాల బుద్ధే’. భూమికి ‘వసుధా, వసుదా, వసుంధరా’ అని నామాలు. సకల విధాల సంపదలను ధరించునది, ఇచ్చునది అని అర్థం. అట్టి అవని (భూమి) మీద నాకే అధికారం, నాదే ఆధిపత్యం అని దానిని అపహరించి సముద్రపు అగాధ జలాలలో దాచాడు దానవుడు. ‘దోచుకో. దాచుకో’- ఈ నిశ్శబ్ద నినాదానికి నిలువెత్తు నిదర్శనమే హిరణ్యాక్షుడు. అప్పుడు ఒక్కడే. ఇప్పుడు ఎందరో! అప్పుడు సాగర జలాలు, ఇప్పుడు ‘స్విస్’ బ్యాంకుల వంటి రహస్య స్థావరాలు! అదీ వ్యాసుని ‘పురాణ’మంటే! ‘పురా అపి నవం’- ఎంత పాతదో అంత కొత్తది! చిత్తగిద్దామా మరి?
బ్రహ్మదేవుడు స్వాయంభువ మనువును- ‘కుమారా! నీవు, నీ కుమారులైన ఉత్తాన పాద-ప్రియవ్రతులు సంతోషంతో భూభారం వహించండి’ అని ఆజ్ఞాపించగా, అతను తండ్రితో- జనకా! అఖిల జంతుజాలానికి ఆధారభూతమైన ‘భూమి ఇప్పుడు మహాసముద్ర మధ్యంలో మునిగి ఉంది. దానిని ఉద్ధరించే ఉపాయం ఆలోచించి అనుగ్రహించమని అర్థించాడు. విధాత తన తండ్రి విష్ణువును స్మరించగా అతని (బ్రహ్మగారి) నాసిక- ముక్కురంధ్రం నుంచి అంగుష్ఠ ప్రమాణంలో వరాహ శిశువు (పంది పిల్ల) జన్మించి, ఆకాశానికి ఎగిరి, ఒక్క క్షణంలో ఏనుగంత అయింది. ప్రళయకాల మేఘ బృందాల వలె గంభీరంగా గర్జించాడు వరాహస్వామి. మునులు, మహర్షులు యజ్ఞ వరాహమూర్తిని కీర్తించారు-‘రమాధీశా! ఈశా! ఈ విశ్వానికి సృష్టికర్తవు, భర్తవు, హర్తవు నీవే. సమస్తమూ నీవై ఈ సర్వలోకాలను మరల-మరల సృష్టిస్తున్నావు. ఈశ్వరా! కేశవా! వేదత్రయ రూపా! దివ్య స్వరూపా! దేవదేవా! అంతులేని నీ వింతలు ‘ఇంత ఇంతల’ని వర్ణించి వాక్రుచ్చడం మా వల్ల అవుతుందా?’
వరాహ స్వామి వననిధి (సాగరం)లో ప్రవేశించి రసాతలంలో భూమిని వెదకి వీక్షించాడు. ఆ భూమిని తన ముట్టెపై పెట్టుకొని- కోర చివర ధరించి పైకి వస్తూండగా హిరణ్యాక్షుడు ఎదురొచ్చి ఎదుర్కొన్నాడు. భీకర యుద్ధంలో వరాహస్వామి వజ్ర కఠోరమైన తన చేతి దెబ్బతో దానవేంద్రుని దునుమాడాడు. దేవ విరోధి ఇట్టి దివ్యమైన దశ-మహర్దశ ఎలా దక్కించుకున్నాడా అని ఆశ్చర్యపడుతూ బ్రహ్మాది దేవతలు ఇలా అనుకున్నారు-
‘మహాయోగులు యోగమార్గాల ద్వారా లింగ (సూక్ష్మ) శరీరాలను తొలంగ (నశింప) జేసుకోవడానికి ఏ అంతర్యామిని తమ అంతరంగాలలో భద్ర పరచుకొని ఆరాధిస్తారో, ఆ ఆదిదేవుని అమృత హస్తపు దెబ్బ తిని, ఆయన ముఖ కమలాన్నే దర్శిస్తూ దేహాన్ని విడిచిన, దుర్భరిత (లోకం భరించలేని వారిలో) శ్రేష్ఠుడైన ఈ దైత్యవల్లభుడు ఎంతటి భాగ్యశాలియో కదా!’ ద్రుహిణుడు (బ్రహ్మదేవుడు) దేవతలకు చెప్పిన ఈ పవిత్ర చరిత్రని మైత్రేయ మహర్షి విబుధవరుడైన విదురునకు వినసొంపుగా విపులంగా వివరించాడు.
తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ
98668 36006