వాషింగ్టన్: అమెరికాలో హిందువులకు వ్యతిరేకంగా దాడులు పెరుగుతున్నట్లు ఆ దేశానికి చెందిన చట్టసభ ప్రతినిధి థానేదార్ తెలిపారు. హిందూఫోబియా(Hinduphobia)కు వ్యతిరేకంగా పోరాటం చేయాలని, ఈ దేశంలో ద్వేషానికి చోటు లేదని ఆయన అన్నారు. బుధవారం క్యాపిటల్ హిల్లో కొన్ని హిందూ గ్రూపులతో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. హిందువుల పట్ల జరుగుతున్న విద్వేష నేరాలను అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఆలయాలపై దాడులు పెరుగుతున్నాయని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులను కూడా టార్గెట్ చేస్తున్నారని, అందుకే హిందూ కాకస్ను ఏర్పాటు చేస్తున్నట్లు థానేదార్ తెలిపారు.
అమెరికా కాంగ్రెస్ చరిత్రలో తొలిసారి హిందూ కాకస్ ఏర్పడిందని, మతస్వేచ్ఛ ఉండాలన్న ఉద్దేశంతో ఆ కాకస్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మత వ్యతిరేకత, ద్వేషంపై ఫైట్ చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికాలో ద్వేషం ఉండవద్దు అని, మతపరమైన హక్కులను గౌరవించాలన్నారు. కాలేజీ క్యాంపస్ల్లో ఎక్కువ శాతం హిందూ వ్యతిరేక దాడులు జరుగుతున్న హిందూ అమెరికన్ ఫౌండేషన్ నేత సుహాగ్ శుక్లా తెలిపారు. గడిచిన రెండేళ్లలో హిందూ వ్యతిరేక దాడుల సంఖ్య పెరిగిందన్నారు. ఖలిస్తానీ దాడులు కూడా పెరుగుతున్నట్లు ఆమె చెప్పారు.