Bangladesh : బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు ఆగడం లేదు. ఇప్పటికే చాలా మందిపై దాడులు జరిగి హత్యకు గురికాగా.. ఇప్పుడు మరో హిందువును బంగ్లాలో దారుణంగా హత్య చేశారు. 62 ఏళ్ల హిందూ వ్యాపారి సుషేన్ చంద్ర సర్కార్ను గుర్తు తెలియని దుండగులు దారుణంగా పొడిచి చంపారు. ఈ ఘటన సోమవారం రాత్రి అతడి షాపులోనే జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిమెన్ సింగ్ జిల్లా, దక్షిణకాండ గ్రామానికి చెందిన సుషేన్ చంద్ర సర్కార్, బోగర్ బజార్ ప్రాంతంలో రైస్, ఇతర ఉత్పత్తులు అమ్ముతూ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అయితే, సోమవారం రాత్రి అతడు షాపులో ఒంటరిగా ఉండగా గుర్తు తెలియని దుండగులు లోపలికి ప్రవేశించి, షాప్ షట్టర్స్ మూసివేశారు. అనంతరం సర్కార్ను కత్తితో అతడిని పొడిచారు. అలాగే షాపులో ఉన్న లక్షల రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. రాత్రి ఎంతసేపటికీ అతడు ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు అతడికోసం గాలించారు. షాపులోకి వచ్చి చూసేసరికి అతడు రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే అతడిని స్థానిక మెడికల్ కాలేజీకి చికిత్స నిమిత్తం తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన సోమవారం రాత్రి 11.00 గంటల సమయంలో జరిగింది.
మృతుడు సుషేన్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా.. తమకు ఎవరితో ఎలాంటి శతృత్వం లేదని అతడి కొడుకు తెలిపాడు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు. బంగ్లాదేశ్లో వచ్చే గురువారం, ఫిబ్రవరి 12న జాతీయ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అక్కడ హిందువులపై దాడులు తీవ్రంగా జరుగుతున్నాయి. ఎన్నికలకు మూడు రోజుల ముందు తాజాగా హిందువు హత్య జరగడం సంచలనంగా మారింది. ఈ ఘటనలపై అక్కడి హిందువులు, మైనారిటీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.