PAK inflation | పాకిస్తాన్లో ఆర్థిక సమస్యలు పెరుగుతున్నాయి. ప్రజల్లో కొనుగోలు శక్తి సన్నగిల్లిపోతున్నది. ఇప్పటికే పలు వస్తువుల ధరలు ఆకాశంపైన కూర్చున్నాయి. ఈ దశంలో దిగువ మధ్యతరగతి ప్రజలు నిత్యావసరాలు కొనుగోలు చేయలేక విలవిల్లాడుతున్నారు. ఇక్కడ అత్యధిక ద్రవ్యోల్బణం నమోదైంది. 47 ఏండ్ల క్రితం నమోదైన దానికంటే తక్కువగా ఉండటం విశేషం.
ప్రస్తుతం పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం 27.6 శాతంగా ఉన్నది. 1975 తర్వాత ఇదే అత్యధికం. అప్పుడు 27.77 గా నమోదైంది. జనవరి 31న అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) బృందం పాకిస్తాన్ చేరుకుని.. తదుపరి 6 బిలియన్ డాలర్ల రుణం విడుదలకు సంబంధించి చర్చలు జరుపుతున్నది. అయితే, తాము విధించిన కఠిన షరతులును నెరవేర్చడంతోపాటు రాజకీయ హామీ కూడా ఇవ్వాలని ఐఎంఎఫ్ కోరింది. ఈ షరతుల్లో ముఖ్యంగా పాకిస్తాన్ ప్రభుత్వం విద్యుత్, ఇంధనం ధరలను 60 శాతం వరకు పెంచాలని ఉన్నది. అలాగే, పన్ను వసూళ్లు రెట్టింపు చేయాలని కూడా షరతుల్లో చేర్చారు. మరో వారం రోజుల్లో ఐఎంఎఫ్-షాబాజ్ సర్కార్ మధ్య చర్చలు ముగియనున్నాయి. షాబాజ్ ప్రభుత్వం ఐఎంఎఫ్ షరతులను అంగీకరిస్తే ద్రవ్యోల్బణం సమస్య పరిష్కారం కాగలదని ఆర్థిక పరిశీలకులు భావిస్తున్నారు.
జనవరి 2022 లో పాకిస్తాన్ ద్రవ్యోల్బణం 13 శాతం. అంటే కేవలం ఒక్క ఏడాదిలోనే ద్రవ్యోల్బణం రెండింతలైంది. ఈ గణాంకాలను పాకిస్తాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (పీబీఎస్) బుధవారం మధ్యాహ్నం విడుదల చేసింది. పీబీఎస్ ప్రకారం – 1975 తర్వాత ద్రవ్యోల్బణం అత్యధికంగా ఈ ఏడాది నమోదైంది. మరోవైపు, డాలర్తో పోలిస్తే పాకిస్తాన్ రూపాయి కూడా వేగంగా పడిపోతున్నది. గురువారం నాడు డాలర్తో పోలిస్తే పాకిస్తాన్ కరెన్సీ విలువ రూ.270 గా ఉన్నది. గతేడాది ఇదే సమయానికి రూ.127 గా ఉండేది.