బీజింగ్, జూలై 20: గంటకు 600 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే రైలును చైనా మంగళవారం ప్రారంభించింది. మాగ్లెవ్(విద్యుదయస్కాంత శక్తితో నడుస్తుంది) అనే సాంకేతికతతో దీనిని నడుపుతారు. క్విన్డాగోలో ఈ రైలును అందుబాటులోకి తీసుకువచ్చారు. భూమ్మీద ప్రయాణానికి ఉద్దేశించిన అన్ని వాహనాల్లోకెల్లా ఈ రైలే వేగవంతం అయినదని చైనా వెల్లడించింది. 2016 అక్టోబర్లో ఈ రైలు ప్రాజెక్టును ప్రారంభించారు. 2020 జూన్లో పరీక్షించారు. ఈ రైలులో 2-10 బోగీలు ఉంటాయని, ఒక్కో బోగీలో 100 మంది ప్రయాణించవచ్చని ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ డింగ్ సన్సాన్ చెప్పారు. 1,500 కిలోమీటర్లలోపు ప్రయాణాలకు ఇది చక్కగా సరిపోతుందన్నారు. దీనికి చక్రాలు ఉండవు. ఇంజన్ కూడా ఉండదు. రైలుకు ఇరువైపులా, కింద ప్రత్యేకంగా తయారు చేసిన అయస్కాంతాలు ఉంటాయి. వీటిల్లో విద్యుత్తు ప్రవహింపజేసినప్పుడు కలిగే ఆకర్షణ, వికర్షణల వల్ల రైలు ముందుకు కదులుతుంది.