Hezbollah vs Israel : హమాస్, హెజ్బొల్లా అగ్ర నేతల హత్యల అనంతరం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రరూపం దాల్చాయి. ఇవాళ (ఆదివారం) తెల్లవారుజామున లెబనాన్లోని హెజ్బొల్లా (Hezbollah) స్థావరాలపై ఇజ్రాయెల్ (Israel) బాంబులతో విరుచుకుపడింది. ఈ విషయాన్ని రెండు దేశాలు ధ్రువీకరించాయి. రాకెట్లు, క్షిపణులతో హెజ్బొల్లా తమపై భారీ దాడికి సిద్ధమైందని, ఆ విషయాన్ని ముందే గుర్తించి ఆత్మ రక్షణ కోసం ముందస్తు దాడులు చేశామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.
త్వరలో రాకెట్లు, క్షిపణులతో ఇజ్రాయెల్లోని పౌర నివాసాలపై హెజ్బొల్లా దాడికి దిగే అవకాశం ఉందని ఆ దేశ సైనిక అధికార ప్రతినిధి అడ్మిరల్ డేనియల్ హగారీ ఈ తెల్లవారుజామున ఇజ్రాయెల్ సైన్యాన్ని అప్రమత్తం చేశారు. ఇజ్రాయెల్పై ఆ ఉగ్రవాద ముఠా విస్తృతస్థాయి దాడికి సిద్ధమవుతోందని చెప్పారు. ఇది లెబనాన్లోని సామాన్య పౌరుల ప్రాణాల మీదకు వస్తోందని, కాబట్టి హెజ్బొల్లా స్థావరాల సమీపంలో ఉన్న పౌరులు అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు.
హగారీ ఈ ప్రకటన చేసిన కాసేపటికే ఉత్తర ఇజ్రాయెల్లోని పౌరులను అప్రమత్తం చేస్తూ సైరన్లు మోగాయి. ఇదిలావుంటే హెజ్బొల్లా దాదాపు 6,000 రాకెట్లు, డ్రోన్లతో దాడికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ తాజాగా 200 హెజ్బొల్లా స్థావరాలను ధ్వంసం చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. దాంతో దాదాపు 320 డ్రోన్లతో ఇజ్రాయెల్పై హెజ్బొల్లా విరుచుకుపడినట్లు వెల్లడిస్తున్నాయి. ఇదిలావుంటే తమ దేశ దక్షిణ ప్రాంతంలో దాడులు జరిగిగాయిన లెబనాన్ మీడియాలో కథనాలు వచ్చాయి.
తాజా దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్లోని బెన్ గురియన్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం పలు విమానాలను దారి మళ్లించింది. టేకాఫ్ కావాల్సిన మరికొన్నింటిని ఎక్కడికక్కడ నిలిపివేసింది. మరోవైపు తాజా సైనిక కార్యకలాపాలను ప్రధాని బెంజామిన్ నెతన్యాహు, సహ రక్షణ మంత్రి యోవ్ గాలంట్.. టెల్ అవీవ్లోని మిలిటరీ ప్రధాన కేంద్రం నుంచి పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. దేశంలో ప్రస్తుతం ప్రత్యేక పరిస్థితి నెలకొని ఉన్నట్లు గాలంట్ ప్రకటించడం గమనార్హం.
బీరుట్లో తమ కమాండర్ ఫాద్ షుక్ర్ హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్పై డ్రోన్లతో దాడులు చేస్తున్నామని హెజ్బొల్లా సైతం ఆదివారం ఉదయం ప్రకటించింది. సైనిక స్థావరాలు సహా ఐరన్ డోమ్ వేదికలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు చేస్తున్నట్లు వెల్లడించింది. తమ తొలివిడత దాడి పూర్తయిందని హెజ్బొల్లా పేర్కొంది. ఈ క్రమంలో ఇప్పటికే హమాస్-ఇజ్రాయెల్ (Israel) మధ్య పోరాటంతో భారీగా ప్రాణ, ఆస్తినష్టాన్ని చవిచూసిన పశ్చిమాసియాలో.. మరో యుద్ధం మొదలైతే మరింత మానవ హననం తప్పదన్న తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
హమాస్కు మద్దతుగా ఇజ్రాయెల్పై అప్పుడప్పుడు దాడులకు దిగిన హెజ్బొల్లా.. ఇప్పుడు నేరుగా యుద్ధంలోకి అడుగుపెట్టినట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా బీరుట్లో తమ కమాండర్ ఫాద్ షుక్ర్ హత్య తర్వాత ఈ ముఠా ఇజ్రాయెల్తో నేరుగా తలపడుతూ వచ్చింది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున దాడికి సిద్ధమవుతున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు ఇజ్రాయెల్ను హెచ్చరించాయి. దాంతో అప్రమత్తమైన ఇజ్రాయెల్ ముందుగానే వాటిని భగ్నం చేసే ప్రయత్నం చేసింది.