జెరూసలేం, అక్టోబర్ 10: ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం తీవ్ర స్థాయిలో కొనసాగుతున్నది. తమ భూభాగంలోకి చొరబడిన హమాస్ బలగాలను ఇజ్రాయెల్ సైన్యం మట్టుపెట్టే పనిలో పడింది. ఇప్పటి వరకు దాదాపు 1,500 మంది హమాస్ మిలిటెంట్లను హతమార్చినట్టు ఇజ్రాయెల్ మంగళవారం వెల్లడించింది. తమ భూభాగంలోని వివిధ ప్రాంతాల్లో వారి మృతదేహాలను గుర్తించామని పేర్కొన్నది. సరిహద్దుల్లోని తమ భూభాగాన్ని తిరిగి నియంత్రణలోకి తీసుకొన్నామని తెలిపింది. మరోవైపు, గాజా వైపు నుంచి సరిహద్దులవైపు ఎవరొచ్చినా కాల్చివేయాలని తమ బలగాలకు ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. మంగళవారం తో యుద్ధం నాలుగో రోజుకు చేరుకొన్నది. దాడులు, ప్రతిదాడులతో గాజా, దక్షిణ ఇజ్రాయెల్లోని ప్రాంతాలు దద్దరిల్లుతున్నాయి. బాంబులు, తుపాకీల మోతతో సాధారణ ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు. రెండు వైపులా మరణించిన వారి సంఖ్య 1600 దాటింది. ఇజ్రాయెల్లో హమాస్ సృష్టించిన మారణహోమంలో మరణాల సంఖ్య 1000 దాటింది. గాజా, వెస్టుబ్యాంకులపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 770 మంది మరణించారని పాలస్తీనా అధికారులు వెల్లడించారు.
హాని తలపెడితే సహించం
తమ భూభాగాల్లోకి చొరబడిన హమాస్ మిలిటెంట్లు దాదాపు 150 మంది సైనికులు, సాధారణ పౌరులను బందీలుగా తీసుకెళ్లినట్టు ఇజ్రాయెల్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో వారికి ఏమైనా హాని తలపెడితే సహించేది లేదని ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ మంత్రి హెచ్చరించారు.
దాడుల్లో హమాస్ ఆర్థిక మంత్రి హతం
డ్రోన్ దాడుల్లో హమాస్ ఆర్థిక మంత్రి జావద్ అబు షమలను చంపేశామని ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ మంగవారం వెల్లడించింది. సోమవారం రాత్రి చేపట్టిన ఈ వాయు దాడుల్లో హమాస్ గ్రూపు పొలిట్బ్యూరో సీనియర్ నేత జకారియా అబూ మోయమ్మర్ కూడా చనిపోయాడని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొన్నది.
మోదీకి నెతన్యాహూ ఫోన్
యుద్ధం నేపథ్యంలో భారత ప్రధాని మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మంగళవారం ఫోన్ చేశారు. తమ దేశంలోని ప్రస్తుత పరిస్థితిపై వివరించినట్టు మోదీ ఎక్స్ పోస్టులో వెల్లడించారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో భారత ప్రజలు ఇజ్రాయెల్కు సంఘీభావంగా ఉంటారని తెలిపారు. మరోవైపు యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రతిపక్షాలతో కూడిన ఐక్య ప్రభుత్వం(వార్ టైమ్ ఎమర్జెన్సీ యూనిటీ గవర్నమెంట్) దిశగా సాగుతున్నది.
చిక్కుకొన్న జమ్ముకశ్మీర్ కుటుంబం
గాజాలో జమ్ముకశ్మీర్కు చెందిన ఓ భారతీయు కుటుంబం చిక్కుకుపోయింది. తమను వెంటనే హమాస్ పాలిత ప్రాంతం నుంచి తరలించాలని భారత అధికారులను వారు మంగళవారం అభ్యర్థించారు.
దశాబ్దాల పాటు గుర్తుంచుకొనేలా చేస్తాం
హమాస్ మిలిటెంట్లకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ గట్టి హెచ్చరికలు చేశారు. తమ దేశం యుద్ధం ప్రారంభించలేదని, అయితే ఈ యుద్ధాన్ని తామే ముగిస్తామని మంగళవారం పేర్కొన్నారు. ఇది తాము కోరుకోని, క్రూరమైన మార్గంలో బలవంతంగా వచ్చిన యుద్ధం అని అన్నారు. ఇజ్రాయెల్పై దాడి చేసి చారిత్రక తప్పిందం చేశామనేలా హమాస్ గ్రూపునకు తగిన విధంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు. హమాస్తోపాటు ఇతర ఇజ్రాయెల్ శత్రు దేశాల దశాబ్దాల పాటు గుర్తుంచుకొనేలా చేస్తామని పేర్కొన్నారు.
పసిపిల్లలపై హమాస్ అమానుషం
ఇజ్రాయెల్లో హమాస్ మిలిటెంట్లు నర మేధం సృష్టిస్తున్నారు. పసిపిల్లలపై కూడా వారు కనికరం చూపించడం లేదు. కెఫర్ అజా కిబుట్జ్లో 40 మంది చిన్నారుల మృతదేహాలను గుర్తించినట్టు ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు.వాటిలో కొన్నింటికి తలలు లేవని పేర్కొన్నారు. కాగా హమాస్ దాడుల వెనుక తమ ప్రమేయం లేదని ఇరాన్ తెలిపింది. ఈ మేరకు ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ వెల్లడించారు.
గ్రామంలో వంద మృతదేహాలు
గాజాలోని హమాస్ స్థావరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. దాడులు, ప్రతిదాడుల ప్రభావానికి ఇప్పటికే రెండు వైపుల ప్రభావిత పట్టణాల నుంచి వేలాది మంది ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. సోమమవారం ఇజ్రాయెల్లోని ఒక్క బీరీ గ్రామంలోనే వంద మృతదేహాలను గుర్తించడం కలకలం రేపింది. ఆ గ్రామ జనాభానే వెయ్యి ఉండగా.. వారిలో 100 మందిని హమాస్ మిలిటెంట్లు చంపేశారని ఇజ్రాయెల్ వర్గాలు చెబుతున్నాయి.
లెబనాన్ నుంచి ఇజ్రాయెల్పై దాడులు
ఇజ్రాయెల్లోని యాష్కెలన్ నగరంపై హమాస్ మిలిటెంట్లు రాకెట్లతో విరుచుకుపడ్డారు. అయితే ప్రాణనష్టంపై వివరాలు తెలియరాలేదు. మరోవైపు లెబనాన్ నుంచి ఇజ్రాయెల్పైకి రాకెట్లు దూసుకువచ్చాయి. వీటికి ఇజ్రాయెల్ సైన్యం దీటుగా బదులిస్తున్నది.