టెల్ అవీవ్: ఇజ్రాయెల్ మరోసారి ముప్పేట దాడిని ఎదుర్కొంటున్నది. ఒకవైపు పాలస్తీనాలోని గాజా నుంచి హమాస్ దాడులు చేస్తుండగా మరోవైపు లెబనాన్, సిరియా నుంచి కూడా ప్రతిఘటనలు ఎదురవుతున్నాయి. ఇరాన్ మద్దతుగా ఉన్న హిజ్బుల్లా బుధవారం మరోసారి లెబనాన్ వైపు నుంచి క్షిపణులు ప్రయోగించింది. (Hezbollah fired missiles into Israel) ఇజ్రాయెల్ సరిహద్దు గ్రామమైన దుహారాలో గైడెడ్ క్షిపణులతో దాడి చేసింది. ఒక ట్యాంక్ను పేల్చివేసింది. ఇజ్రాయెల్ ఆర్మీని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి చేసినట్లు హిజ్బుల్లా ప్రకటించింది. ఇజ్రాయెల్ ఇటీవల జరిపిన దాడుల్లో తమ వారిని కోల్పోవడంతో ప్రతిస్పందనగా క్షిపణులు ప్రయోగించినట్లు తెలిపింది. తమ దేశ ప్రజలు,సెక్యూరిటీని ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంటే తగిన విధంగా బదులిస్తామని హిజ్బుల్లా హెచ్చరించింది.
కాగా, లెబనాన్ నుంచి హిజ్బుల్లా ప్రయోగించిన యాంటీ ట్యాంక్ క్షిపణులపై ఇజ్రాయెల్ ఆర్మీ స్పందించింది. లెబనాన్ ప్రాంతాలపై ప్రతిగా దాడులు చేస్తున్నది. ఈ నేపథ్యంలో ఇరు వైపు దాడులతో ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దు ప్రాంతం దద్దరిల్లుతున్నది.
మరోవైపు సిరియా సైన్యం కూడా సరిహద్దు నుంచి ఇజ్రాయెల్ ఆర్మీపై కాల్పులు జరుపుతున్నది. బాంబు షెల్స్ ప్రయోగిస్తున్నది. దీంతో ఇజ్రాయెల్ సైనికులు ఇక్కడ కూడా ప్రతి దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ మరోసారి మూడు దేశాల సరిహద్దుల్లో ముప్పేట దాడిని ఎదుర్కొంటున్నది.