బీజింగ్: చైనాలో భీకర వర్షాలు కురుస్తున్నాయి. దేశ రాజధాని బీజింగ్లో ఎడతెరిపిలేకుండా వాన కురుస్తోంది. దీంతో ఆ నగర సమీప ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. టైఫూన్ డొక్సూరి(Typhoon Doksuri) వల్ల బీజింగ్ నగరంలో కూడా లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. దశాబ్ధ కాలంలో రికార్డు స్థాయిలో వర్షాలు కురిసినట్లు అధికారులు చెబుతున్నారు. ఉత్తర చైనాలోని హీబై ప్రావిన్సు, తియాంజిన్ మున్సిపాల్టీల్లో వరద పరిస్థితి బీభత్సంగా ఉంది. బీజింగ్ పరిసర ప్రాంతాల్లో వరదల వల్ల ఇప్పటి వరకు 11 మంది మరణించారు.
హిబైలోని జింగ్టాయిలో వెయ్యి మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. ఇది మరీ మరీ ఎక్కువ అని జాతీయ వాతవరణ శాఖ తెలిపింది. ఆ ప్రాంతంలో ఏడాది మొత్తం 500 మిమీ మాత్రమే కురుస్తుందని, కానీ ఒక్కసారే దానికి రెండు రేట్లు వర్షం కురవడం దారుణమని వాతావరణ శాఖ పేర్కొన్నది. బీజింగ్లోని కొన్ని ప్రాంతాల్లో బ్రిడ్జ్లు కొట్టుకుపోయాయి. వరద ధాటికి కార్లు కూడా ఆ ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు అధికారులు వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
బీజింగ్లో దాదాపు రెండున్న కోట్ల జనాభా ఉంటుంది. ఆ ఒక్క నగరంలోనే నెలలో కురవాల్సిన వర్షపాతం కేవలం 48 గంటల్లోనే కురిసింది. అక్కడ దాదాపు 176 మిల్లీమీటర్ల వర్షం నమోదు అయ్యింది. 2012లో వచ్చిన టైఫూన్ వల్ల అప్పుడు బీజింగ్లో 77 మంది మరణించారు.