ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ ప్రమాదం పెరుగుతున్నది. ప్రతి సంవత్సరం మిలియన్ల మంది కొత్త వ్యక్తులు ఈ దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. పాంక్రియాస్ తగినంత ఇన్సులిన్ను ఉత్పత్తి చేయకపోవడం (రక్తంలో చక్కెరను నియంత్రించే హార్మోన్), శరీరం ఉత్పత్తి చేసే ఇన్సులిన్ను సమర్థవంతంగా ఉపయోగించకపోవడంతో మధుమేహం బారినపడే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. దశాబ్దాల క్రితం వరకు డయాబెటిస్ అనేది వయసుతో పాటు వచ్చే ఆరోగ్య సమస్యగా భావించే వారు. అయితే, అది యువకులను సైతం బాధితులుగా మారుస్తుందని పేర్కొంటున్నారు.
రక్తంలో అధిక చెక్కెర స్థాయి (hyperglycaemia)కి చికిత్స అందించకుండా అలాగే వదిలేస్తే నరాలు, రక్తనాళాలకు తీవ్రమైన నష్టాన్ని కలుగజేస్తాయని వైద్యులు పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. ప్రపంచంలో డయాబెటిక్ రోగుల సంఖ్య పెరుగుతోంది. పెద్దవారిలో మధుమేహం ముప్పు పెరగడానికి జీవనశైలి, ఊబకాయం ప్రధానకారణాలని పేర్కొంటున్నారు. చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ హార్వర్డ్ టీహెచ్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రీ-డయాబెటిస్, టైప్-2 డయాబెటిస్ను జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా నివారించవచ్చని పేర్కొన్నారు.
అధిక బరువు, ఊబకాయం ఉన్న వారికి టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందని హార్వర్డ్ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. అనేక అధ్యయనాలు బెల్లీ ఫ్యాట్ కణాలను ‘ఇన్ఫ్లమేటరీ’ రసాయనాలను విడుదల చేయడానికి ప్రేరేపిస్తుందని, దీని ఫలితంగా శరీరం ఇన్సులిన్ను తక్కువ సున్నితంగా మారుతుందని సూచిస్తున్నాయి. ఈ పరిస్థితి ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాల పనితీరును, సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు అందరూ బరువుపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.
నిరంతరం ఒకే చోట కూర్చోవడం, పని చేయడం లేదా రోజంతా విశ్రాంతి తీసుకోవడం అలవాటు చేసుకోవడంతో ఆరోగ్యంపై తీవ్రమైన సమస్యల ముప్పు పెరిగే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు. దీని వల్ల టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుందని చెప్పారు. శరీర కండరాలను చురుగ్గా ఉండేలా చూసుకోవడం వల్ల ఇన్సులిన్ గ్లూకోజ్ను గ్రహించే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందన్నారు. మధుమేహం నుంచి శరీరాన్ని కాపాడుకొని ఆరోగ్యంగా, సురక్షితంగా ఉండేందుకు ఒకే చోట తక్కువగా కూర్చుకోవడంతో పాటు ఎక్కువ నడవడం అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు.
టైప్-2 డయాబెటిస్ నుంచి కాపాడుకొని ఫిట్గా ఉండేందుకు ఆహారంలో నాలుగు విషయాలపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని హార్వర్డ్ నిపుణులు పేర్కొన్నారు. తియ్యని పానియాలకు దూరంగా ఉండాలని.. వాటికి బదులుగా పండ్ల రసాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలను ఆహారంలో చేర్చుకోవాలి. ఎర్రని మాంసం, ప్రాసెస్ చేసిన మాంసం తీసుకోవడం తగ్గించి.. బదులుగా గింజలు, బీన్స్, తృణధాన్యాలు, చేపలు, ఫౌల్ట్రీ ఉత్పత్తులు తీసుకోవడం పెంచాలని సూచించారు.
ధూమపానం గుండె, ఊపిరితిత్తుల వ్యాధులతో పాటు టైప్ -2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతాయని హార్వర్డ్ నిపుణులు తెలిపారు. ధూమపానం చేయని వారి కంటే ధూమపానం చేసేవారికి 50 శాతం మధుమేహం వచ్చే అవకాశం ఉంది. అమెరికా ఎఫ్డీఏ ప్రకారం.. ధూమపానం ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించే సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా.. మధుమేహ వ్యాధిగ్రస్తులకు మద్యం సేవించడం కూడా చాలా ప్రమాదకరం. ఆల్కహాల్, ధూమపానానికి దూరంగా ఉండడం వల్ల టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించవచ్చని పేర్కొంటున్నారు.