జెరూసలేం: హమాస్ (Hamas) మిలిటెంట్ సంస్థకు చెందిన అధికార ప్రతినిధి హసన్ యూసఫ్ (Hassan Yusef) ను ఇజ్రాయెల్ దళాలు అరెస్టు చేశాయి. గురువారం వెస్ట్ బ్యాంక్ (West Bank) లో నిర్వహించిన దాడుల్లో అతడిని అదుపులోకి తీసుకున్నారు. హమాస్ కోసం పలు హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలపై యూసఫ్ను అదుపులోకి తీసుకున్నట్లు ఇజ్రాయెల్ అంతర్గత భద్రతా సంస్థ షిన్బెట్ ప్రకటించింది.
పాలస్తీనాలో ప్రభావవంతమైన నేతల్లో హసన్ యూసఫ్ ఒకరు. ప్రస్తుతం అతను హమాస్ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నాడు. వెస్ట్బ్యాంక్ చట్టసభలో సభ్యుడు కూడా. వెస్ట్ బ్యాంక్లో హమాస్కు చెందిన కీలకమైన 60 మంది సభ్యులను ఇజ్రాయెల్ బంధించింది. కాగా, గతంలో యూసఫ్ దాదాపు 24 ఏళ్లు జైల్లోనే గడిపాడు. అంతర్జాతీయ మీడియాలో కూడా హమాస్ ప్రతినిధిగా యూసఫ్ తరచూ కనిపిస్తుంటాడు. ఇజ్రాయెల్ వాయుసేన దాడులు ఆపితే హమాస్ 200 మంది బందీలను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తుందని ఇటీవల కెనడాకు చెందిన ది గ్లోబ్ అండ్ మెయిల్కు యూసఫే వెల్లడించాడు.
గాజాలో నీటికి కటకట.. ఇంధన కొరత
గాజాను ఇజ్రాయెల్ సేనలు దిగ్బంధించడంతో అక్కడ తీవ్రమైన ఇంధన, నీటి, విద్యుత్తు కొరత ఏర్పడింది. అక్కడ చాలా ఆస్పత్రులు మూతపడుతున్నాయి. ఈ విషయాన్ని ఐరాసకు చెందిన ది కోఆర్డినేషన్ ఆఫ్ హ్యుమానిటేరియన్ అఫైర్స్ వెల్లడించింది. గాజాలో కార్యకలాపాలు నిర్వహించే కేర్ సంస్థకు చెందిన 60 కార్యాలయాలు, ఆస్పత్రులు మూతపడ్డాయని పేర్కొంది. మరోవైపు కేర్ సంస్థ గాజా డైరెక్టర్ హిబా టిబి ఓ ఆంగ్ల వార్త సంస్థతో మాట్లాడుతూ.. ‘మాకు చమురు, ప్రజలకు పరిశుభ్రమైన నీరు అవసరం. ప్రస్తుతం ఇవి లభించడం గాజాలో కష్టమైపోయింది. దీంతోపాటు వైద్యశాలలకు, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు ఇంధన అవసరం చాలా ఉంది. ఇక్కడ నీరు, ఇంధనం, విద్యుత్తు లభిస్తే పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. పలువురి ప్రాణాలు కాపాడటం సాధ్యపడుతుంది’ అని అన్నారు.