న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: ఐదు లక్షల మంది ఉక్రెయిన్ పౌరులను రష్యా బలగాలు వారి భూభాగంలోకి బలవంతంగా తరలించాయని ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కో ఆపరేషన్ ఇన్ యూరప్(ఓఎస్సీఈ) తాజా నివేదికలో వెల్లడించింది. వారిని ఉక్రెయిన్ సరిహద్దుల్లో క్యాంపుల్లో నిర్బంధించారని పేర్కొన్నది. ఉక్రెయిన్లో రష్యా యుద్ధ నేరాలపై ఓఎస్సీఈ మార్చి 14 నుంచి దర్యాప్తు చేస్తున్నది. ఈ నెల 5న ఐరోపా పార్లమెంటుకు నివేదిక సమర్పించింది. ఉక్రెయిన్ మహిళలపై రష్యా బలగాల లైంగిక దాడుల అంశాన్ని కూడా ఇందులో ప్రస్తావించింది. గురువారం ఎస్తోనియా పార్లమెంటును ఉద్దేశిస్తూ మాట్లాడిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా ఇవే ఆరోపణలు చేశారు.
యుద్ధ నౌక ధ్వంసం
నల్ల సముద్రంలో రష్యాకు చెందిన ప్రధాన యుద్ధ నౌకల్లో ఒకటైన మోస్కాను నెప్ట్యూన్ క్షిపణితో పేల్చేశామని ఉక్రెయిన్ ప్రకటించుకొన్నది. క్షిపణి దాడి అనంతరం నౌకలో మంటలు చెలరేగాయని, తర్వాత నౌకలో ఉన్న బాంబులు పేలాయని తెలిపింది. అయితే, తమ యుద్ధ నౌక ధ్వంసమైన మాట వాస్తవమేనని, కానీ ఉక్రెయిన్ క్షిపణి దాడుల వల్ల కాదని రష్యా తెలిపింది. యుద్ధ నౌకలో మంటలు చెలరేగడంతో ఆయుధాలు విస్ఫోటం చెందాయని పేర్కొన్నది.
యూఎన్లో రష్యా భంగపాటు
ఐరాసలో రష్యాకు మరోసారి చుక్కెదురైంది. యూఎన్ ఎకనమిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అనుబంధ బోర్డుల్లోని నాలుగు కమిటీలకు బుధవారం ఎన్నికలు జరిగాయి. రష్యా నాలుగు కమిటీలకు పోటీ చేయగా అన్నింట్లో ఓడిపోయింది. అంతర్జాతీయంగా రష్యా ఏకాకి కావడాన్ని ఇది సూచిస్తున్నది.