దశాబ్ద కాలంలోనే అతి పెద్ద సమ్మెతో బ్రిటన్ అట్టుడుకుతున్నది. పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా.. తమ వేతనాలు పెంచాలని, పని పరిస్థితులు మెరుగుపర్చాలని డిమాండ్ చేస్తూ పలు రంగాలకు చెందిన కార్మికులు బుధవారం నుంచి సమ్మె చేపట్టారు.
దాదాపు 5 లక్షల మందికి పైగా కార్మికులు బ్రిటన్ వీధుల్లో ఆందోళనలు చేపట్టారు. విద్య, రవాణా, పౌరసేవలు, తదితర రంగాలకు చెందిన కార్మికులు పని వాకౌట్ చేయడంతో బ్రిటన్ వ్యాప్తంగా ఎక్కడ చూసినా.. పాఠశాలల మూతపడ్డాయి. రైలు సర్వీసులు ఆగిపోయాయి. ప్రభుత్వ కార్యాలయాలు ఖాళీగా దర్శనమిచ్చాయి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కార్మికులు ముక్తకంఠంతో నినదించారు. 2011 నవంబర్ 30న జరిగిన పెన్షనర్ల సమ్మె తర్వాత ఇంత పెద్దఎత్తున సమ్మె జరగడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.