Shoaib Akhtar : పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ వివాదంలో చిక్కుకున్నాడు. షోయబ్ సోదరుడు షాహిబ్ అక్తర్ అంత్యక్రియలు ఇస్లామాబాద్లో జరిగాయి. ఈ కార్యక్రమానికి నిషేధిత సంస్థలకు చెందిన ఉగ్రవాదులు హాజరవ్వడం సంచలనంగా మారింది. వారిలో పహల్గాం ఉగ్రదాడి సూత్రధారి సహా లష్కర్ ఎ తయిబాకు చెందిన ఉగ్రవాదులు పాల్గొన్నారు. అలాగే, స్థానిక రాజకీయ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో పాకిస్తాన్లో ఉగ్రవాదులకు, స్థానిక రాజకీయ నాయకులకు, క్రీడాకారులకు మధ్య ఉన్న సంబంధాలు మరోసారి చర్చకు వస్తున్నాయి. ఉగ్రవాదులు బహిరంగంగానే తిరుగుతున్నా అక్కడి ప్రభుత్వం మాత్రం ఉగ్ర సంస్తలతో తమకేం సంబంధం లేదని ప్రకటిస్తూ ఉంటుంది. ఇక, తాజా అంశానికి సంబంధించి షోయబ్ సోదరుడు షాహిబ్ అక్తర్ అంత్యక్రియలకు లష్కర్ ఇ తయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి హాజరయ్యాడు. గత ఏడాది కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి సూత్రధారుల్లో అతడు ఒకడు. ఈ దాడి తర్వాత కూడ సైఫుల్లా కసూరి భారత్కు పలుమార్లు హెచ్చరికలు జారీ చేశాడు. 26/11 తరహా దాడులు భారత్లో మళ్లీ నిర్వహిస్తామని హెచ్చరించాడు. లష్కర్ ఇ తయిబా సంస్థను ఐక్యరాజ్య సమితి ఉగ్రసంస్థగా గుర్తించి, నిషేధించింది. ఈ సంస్థ వ్యవస్తాపకుడు హఫీజ్ సయీద్ తనయుడు తల్హా సయీద్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. అతడు కూడా ఈ సంస్థలో పని చేస్తున్నాడు.
అలాగే నిషేధిత ఉగ్ర అనుబంధ సంస్థ పాకిస్తాన్ మర్కాజి ముస్లిం లీగ్ (పీఎంఎంఎల్) సభ్యులు కూడా హాజరయ్యారు. ఇటు ఉగ్రవాదులు, స్థానిక రాజకీయ నేతలు అంత్యక్రియలకు హాజరవ్వడం ద్వారా ఉగ్రవాదులకు పాక్ ఏ విధంగా సహకరిస్తుందో అర్థమవుతోంది. ఈ విషయంపై భారత్ ఎప్పటినుంచో విమర్శలు చేస్తోంది. ఉగ్రవాదుల కేంద్రంగా పాక్ తయారైందని, వారిని ఆ దేశం రహస్యంగా కాపాడుతోందని పలు అంతర్జాతీయ వేదికలపై వెల్లడించింది.