శాన్ ఫ్రాన్సిస్కో: సుమారు 600 మిలియన్ల డాలర్ల విలువైన క్రిప్టోకరెన్సీని హ్యాకర్లు దొంగలించారు. పాపులర్ ఆన్లైన్ గేమ్ ఎక్సీ ఇన్ఫినిటీ లెడ్జర్ నుంచి ఆ దొంగతనం జరిగింది. ఇటీవల క్రిప్టోకరెన్సీకి డిమాండ్ పెరగడంతో.. టెక్ దొంగలు ఆ మనీని టార్గెట్ చేస్తున్నారు. 1,73,600 ఈతర్లతో పాటు 25.5 మిలియన్ డాలర్ల విలువైన స్టేబుల్కాయిన్ను డిజిటల్ లెడ్జర్ నుంచి చోరీ చేసినట్లు రోనిన్ నెట్వర్క్ తెలిపింది. మార్చి 23వ తేదీన చోరీ జరిగింది. ఆ సమయంలో ఆ కరెన్సీ విలువ సుమారు 545 మిలియన్ల డాలర్లు. అయితే మంగళవారం నాటి ధరలతో పోలిస్తే ఆ విలువ 615 మిలియన్ల డాలర్లు ఉంటుందని బావిస్తున్నారు.
క్రిప్టో ప్రపంచంలో ఇప్పటి వరకు జరిగిన చోరీల్లో ఇదే అతిపెద్దదని రోనిన్ నెట్వర్క్ తెలిపింది. దొంగలించిన కరెన్సీ ఇంకా హ్యాకర్ల వ్యాలెట్లోనే ఉన్నట్లు ఆ సంస్థ చెప్పింది. ఇతర్ కరెన్సీ విత్డ్రా కోసం మంగళవారం ఓ వినియోగదారుడు ప్రయత్నించాడు. అయితే ఆ సమయంలో ఎక్సీ ఇన్ఫినిటీలో చోరీ జరిగినట్లు గుర్తించారు. హ్యాకింగ్ ఘటనపై రోనిన్ సంస్థ విచారణ చేపడుతోంది. హ్యాకర్ల వద్ద డిజిటల్ ఫండ్స్కు చెందిన విత్డ్రా కీ ఉన్నట్లు తెలుస్తోందన్నారు.