న్యూఢిల్లీ: మీరు చదివింది నిజమే. ఓ ఎంబ్రాయిడరీ వేసిన కుర్తా రూ.2 లక్షలు.. క్రోక్స్లాగా కనిపించే రబ్బరు షూస్కు రూ.40 వేలు. ఇటలీకి చెందిన ప్రముఖ బ్రాండ్ గుచ్చి ఆఫర్ చేస్తున్న రేట్లు ఇవి. మొదట కుర్తాకు రూ.2 లక్షలు అన్నప్పుడే ఈ బ్రాండ్పై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయినా ఆ బ్రాండ్ తాజాగా ఇలా రబ్బర్ షూస్కు రూ.40 వేలు అని చెప్పడంతో మరిన్ని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పురుషులు, స్త్రీలకు మూడేసి రంగుల్లో ఈ రబ్బర్ షూస్ను గుచ్చి లాంచ్ చేసింది. మరో ప్రముఖ బ్రాండ్ క్రోక్స్ ఇలాంటి షూస్తో పాపులర్ అయింది. ఇప్పుడు గుచ్చి కూడా అచ్చూ అలాంటి షూస్నే లాంచ్ చేసి ఇంత భారీ ధరను నిర్ణయించడం విశేషం.
దేశీ స్టైల్ కుర్తాకు రూ.2 లక్షల ధర నిర్ణయించడంతో ఈ మధ్యే ఈ బ్రాండ్పై తీవ్ర విమర్శలు వచ్చాయి. భారతీయ సంస్కృతి నుంచి స్ఫూర్తి పొంది తయారు చేసిన ఈ కుర్తాకు 2100 డాలర్ల నుంచి 3500 డాలర్ల ధర నిర్ణయించింది గుచ్చి. ఇదే కుర్తా ఇండియాలో అయితే ఎంత మంచి క్వాలిటీ అయినా మూడు, నాలుగు వేలకు మించదని దేశీ నెటిజన్లు కామెంట్లు చేశారు.