హైదరాబాద్: భూగర్భం నుంచి నీటి(Ground Water)ని తోడుతున్న మానవులు.. ఆ భూమి భ్రమణాన్నే మార్చేశారు. 1993 నుంచి 2010 వరకు భారీ స్థాయిలో భూ గర్భం నుంచి నీటిని తోడడం వల్ల.. భూభ్రమణం మారినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. గ్రౌండ్వాటర్ను అధిక స్థాయిలో తోడడం వల్ల భూమి సుమారు 80 సెంటీమీటర్ల మేర తూర్పు వైపునకు మళ్లినట్లు ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు. జియోఫిజికల్ రీసర్చ్ లెటర్స్కు చెందిన జర్నల్లో ఈ విషయాన్ని పబ్లిష్ చేశారు.
భూ ఫలకాల్లో ఉండే నీరు కదులుతున్న తీరును బట్టి .. భూ భ్రమణంలో సహజంగా కొంత తేడా వస్తుందని, అయితే ఇటీవల అధిక స్థాయిలో నీరును తోడడం వల్ల భూమి ఆక్షం కాస్త మారినట్లు గుర్తించారు. 1993 నుంచి 2010 మధ్య కాలంలో సుమారు 2150 బిలియన్ టన్నుల భూగర్భ జలాన్ని మానవులు తోడినట్లు శాస్త్రవేత్తలు ఓ స్టడీ ద్వారా అంచనా వేశారు. సముద్ర జలాల్లో నీటి మట్టం పెరగడానికి ఇది కూడా ఒక కారణమని సైంటిస్టులు వెల్లడించారు.
భూమిపై ఉన్న నీరు వల్ల భూభ్రమణంలో మార్పు ఉంటుందన్న విషయాన్ని 2016లో గుర్తించారు. అయితే భూగర్భ జలాల వల్ల భూ భ్రమణంలో మార్పు వస్తుందన్న విషయాన్ని తాజా స్టడీతో నిర్ధారణకు వచ్చారు. భూ గ్రహం ఏ దిశగా వరిగింది, భూమిలో ఉన్న నీరు ఏ దిశగా కదిలిందన్న మార్పులను కొత్త స్టడీలో గమనించారు. తొలుత మంచు ఫలకాలు, గ్లేసియర్లను స్టడీ చేశారు. ఆ తర్వాత గ్రౌండ్వాటర్ ఏ విధంగా పంపిణీ జరిగిందన్న కోణంలో విశ్లేషణ చేశారు.
భూగర్భ జలాలు విస్తరించిన తీరు వల్లే భూ భ్రమణం కూడా ఉంటుందని సౌత్ కొరియాకు చెందిన యూనివర్సిటీ ప్రొఫెసర్ కీ వియాన్ సీయో తెలిపారు. ఏ ప్రాంతం నుంచి ఎంత గ్రౌండ్వాటర్ను తీస్తున్నారో గమనిస్తే, భూమి కూడా ఏ ద్రువం దిశగా కదులుతుందో అంచనా వేయవచ్చు. మధ్య అక్షాంశాల వద్ద నుంచి భూగర్భ జలాన్ని ఎక్కువగా తోడేస్తున్నట్లు శాస్త్రవేత్తలు గురించారు. ఉత్తర అమెరికాలోని పశ్చిమ ప్రాంతంతో పాటు భారత్లోని వాయువ్య ప్రాంతాల్లో భూగర్భ జలాలను అధికంగా తోడినట్లు భావిస్తున్నారు. భూగర్భ జలాలను అధికంగా తోడినా.. దాని వల్ల రుతువుల్లో ఎటువంటి మార్పు ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.