క్వెట్టా: బలూచిస్తాన్లోని డేరా అల్లాయార్ పట్టణంలో గ్రనేడ్ దాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులతో పాటు దాదాపు 17 మంది గాయపడ్డారని డాన్ న్యూస్ నివేదించింది. ఆదివారం పొద్దుపోయాక బైకులపై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు సుబత్పూర్ చౌక్ సమీపంలో హ్యాండ్ గ్రెనేడ్ విసిరి పారిపోయారు. అది పేలడంతో అక్కడే విధుల్లో ఉన్న ఇద్దరు ట్రాఫిక్ పోలీసు కానిస్టేబుళ్లతో పాటు దాదాపు 17 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. పేలుడు జరిగిన వెంటనే భద్రతా అధికారులు ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన వారిని స్థానిక దవాఖానకు చికిత్స నిమిత్తం తరలించారు.
గ్రనేడ్ దాడిలో గాయపడిన వారిలో కనీసం నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు దవాఖాన వర్గాలు తెలిపాయి. పోలీసులను లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. పేలుడు ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. అయితే గ్రనేడ్ దాడికి బాధ్యులమని ఇంతవరకు ఎవరూ ప్రకటించలేదు. బలూచిస్థాన్ ముఖ్యమంత్రి మీర్ అబ్దుల్ ఖుదూస్ బిజెంజో, బలూచిస్థాన్ అసెంబ్లీ స్పీకర్ మీర్ జాన్ ముహమ్మద్ ఖాన్ జమాలీ ఘటనను ఖండిస్తూ, దీనిని తీవ్రవాద చర్యగా అభివర్ణించారు.