కొలంబో, జూలై 13: ఆర్థిక, ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకను రాజకీయ సంక్షోభం మరింత కుదిపేస్తున్నది. బుధవారం రాజీనామా చేస్తానని హామీనిచ్చిన అధ్యక్షుడు గొటబయ రాజపక్స గుట్టుచప్పుడు కాకుండా దేశం విడిచి మాల్దీవులకు పారిపోయారు. ఈ విషయం తెలుసుకున్న లంకేయులు ఆగ్రహంతో ఊగిపోయారు. అధ్యక్ష పదవికి గొటబయ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వేలాదిమంది నిరసనకారులు బుధవారం రాజధాని కొలంబో వీధుల్లో ఆందోళనలు ఉధృతం చేశారు. ప్రధాని రణిల్ విక్రమసింఘే కూడా పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేశారు. ప్రధాని అధికారిక నివాసంలోకి చొచ్చుకువెళ్లడానికి ప్రయత్నించారు.
దీంతో నిరసనకారులపై పోలీసులు జలఫిరంగులు, భాష్పవాయు గోళాలు ప్రయోగించారు. మరోవైపు, ప్రజల ఆందోళనలు, ఆగ్రహానికి జడిసి బుధవారం తెల్లవారుజామున భార్య, ఇద్దరు అంగరక్షకులతో కలిసి వాయుసేన విమానంలో గొటబయ మాల్దీవులు రాజధాని మాలేకు పరారైనట్టు ఇమ్మిగ్రేషనన్ అధికారి ఒకరు తెలిపారు. మాల్దీవుల్లో ఉన్న గొబటయ.. ప్రధాని విక్రమసింఘెను తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించారు. తాత్కాలిక అధ్యక్షుడి హోదాలో విక్రమసింఘే దేశవ్యాప్తంగా అత్యయిక స్థితి విధించారు. ఫాసిస్టులు గద్దెనెక్కి ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కూలదోసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. శాంతి, భద్రతలను పరిరక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మిలిటరీ, సైనికులను ఆదేశించారు.
గొటబయ పరారీపై భారత్ స్పందన
గొటబయ మాల్దీవులకు పరారుకావడానికి భారత్ సహకరించిందని శ్రీలంక మీడియా కథనాలు ప్రసారం చేశాయి. అయితే, ఈ ఆరోపణలను శ్రీలంకలోని భారత హైకమిషన్ ఖండించింది.
మాల్దీవుల నుంచి యూఏఈ లేదా సింగపూర్
మాల్దీవులకు పలాయనం చిత్తగించిన గొటబయకు అక్కడ కూడా నిరసనలే స్వాగతం పలికినట్టు సమాచారం. గొటబయను లంకకు పంపేయాలంటూ రాజధాని మాలెలోని పలువురు లంకేయులు ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి గొటబయ అక్కడి నుంచి కూడా మరోచోటుకు పారిపోనున్నట్టు సమాచారం. యూఏఈ లేదా సింగపూర్కు ఆయన వెళ్లనున్నట్టు వార్తలు వస్తున్నాయి. కొత్త ప్రాంతానికి చేరుకున్న తర్వాత గొటబయ రాజీనామా ప్రకటన చేయవచ్చని తెలుస్తున్నది. కాగా, లంకేయులకు మాల్దీవుల పౌరులు మద్దతు ప్రకటించారు.