ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలో గూగుల్, ట్రిప్అడ్వయిజర్ సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. రష్యాలోని పలు రెస్టారెంట్లకు సంబంధించిన రివ్యూ సెక్షన్లో నెటిజన్లు ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తున్నారు. అనానిమస్ అనే హ్యాకర్ల గ్రూప్, ఉక్రెయిన్కు చెందిన ఐటీ ఆర్మీ గ్రూపులు ఈ ఆలోచనను ప్రచారం చేశాయి.
‘‘గూగుల్ మ్యాప్స్కు వెళ్లండి. దానిలో రష్యాలోకి వెళ్లండి. అక్కడ ఏదైనా రెస్టారెంటు లేదా వేరే వ్యాపార సంస్థను ఎంచుకోండి. దానికి రివ్యూ ఇవ్వండి. ఉక్రెయిన్లో జరుగుతున్న ఘోరాలను అక్కడ వివరించండి’’ అంటూ ఈ గ్రూపులు తమ ఫాలోవర్లకు సూచించాయి. ఈ క్రమంలో చాలా రష్యా సంస్థల రివ్యూ సెక్షన్లలో ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన ఫొటోలు, రష్యా సైనికులు పట్టుబడిన వార్తలు ప్రత్యక్షమయ్యాయి.
ఈ నేపథ్యంలోనే రష్యా, ఉక్రెయిన్, బెలారస్ దేశాలలోని రెస్టారెంట్లు, వ్యాపార సంస్థలకు రివ్యూలు ఇచ్చే ఆప్షన్ను తొలగిస్తున్నట్లు గూగుల్ పేర్కొంది. ట్రిప్అడ్వయిజర్ సంస్థ కూడా ఇదే నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. కాగా, ఇవే కాకుండా గూగుల్ సంస్థ మరికొన్ని చర్యలు కూడా తీసుకుంది.
ఉక్రెయిన్ దళాలకు సంబంధించిన సమాచారం రష్యాకు తెలుస్తుందనే కారణంతో గూగుల్ మ్యాప్స్ సేవలను ఉక్రెయిన్ దేశంలో నిలిపివేసింది. గూగుల్ సబ్సిడరీ అయిన యూట్యూబ్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. తప్పుడు వార్తలు ప్రచారం చేయకూడదనే కారణంతో రష్యాకు చెందిన స్పుత్నిక్, ఆర్టీ వార్తా సంస్థల ఛానెళ్లను సస్పెండ్ చేసింది.