వాషింగ్టన్ : హవాయిలోని మౌనా లోవా అగ్నిపర్వతం దాదాపు 38 సంత్సరాల తర్వాత బద్ధలైంది. ప్రస్తుతం లావాను వెదజల్లుతుండగా.. భారీగా బూడిదను వెదజల్లుతున్నది. సోమవారం రాత్రి 11.30 గంటలకు అగ్నిపర్వతం బద్దలవగా.. హవాయి కౌంటీ సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆ తర్వాత మూడు గంటల పాటు కైలువా, ఓల్డ్ కోనా విమానాశ్రయంలో సేవలను పునరుద్ధరించారు. లావా ప్రవాహం కొండ ప్రాంతంలోనే ఉందని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని పేర్కొంటూ.. అలెర్ట్ను ఉపసంహరించుకుంది. అయితే, అగ్నిపర్వతం విస్ఫోటనం నేపథ్యంలో లావా ప్రవాహంలో వేగంగా మార్పులు ఉండవచ్చని, అధ్వానమైన పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని నిపుణులు హెచ్చరించారు.
జనాభా ఉన్న ప్రాంతాలకు లావా చేరుకోవడానికి వారాల సమయం పడుతుందని పేర్కొన్నారు. విస్ఫోటనానికి ముందు రోజుల్లో మౌనా లోవా చుట్టూ భూకంపాలు పెరిగాయి. రిక్టర్ స్కేల్పై 3.0 కంటే తక్కువ తీవ్రతతో 18 భూకంపాలు సంభవించాయి. మౌనా లోవా హవాయి గొలుసులో దక్షిణ చివరలో ఉంది. అగ్నిపర్వతం సముద్ర మట్టానికి 13,670 అడుగుల ఎత్తులో ఉంది. ఈ అగ్నిపర్వతం 1950లో విస్ఫోటనం చెందిన సమయంలో పర్వతం నుంచి లావా సముద్రానికి 15 మైళ్ల దూరం ప్రయాణించడానికి మూడు గంటల కంటే తక్కువ సమయం పట్టింది. విస్ఫోటనం చివరి సారిగా 1984లో 20 రోజుల పాటు లావాను వెదజల్లింది.