బెర్లిన్: భారతీయ చిన్నారి అరిహా షా (Ariha Shah) ను తల్లిదండ్రుల కస్టడీకి అప్పగించేందుకు జర్మనీ కోర్టు నిరాకరించింది. ఆ పాప గాయాలపై పెరేంట్స్ సరైన సమాధానం ఇవ్వకపోవడంతో వారి పిటిషన్ను శుక్రవారం తిరస్కరించింది. సంరక్షణ కోసం ఆ చిన్నారిని జర్మనీ యువజన సంక్షేమ కార్యాలయానికి అప్పగించింది. దీంతో జర్మనీ కోర్టు నిర్ణయం పట్ల పాప తల్లిదండ్రులు కలత చెందారు. భారత్కు చెందిన దంపతులు గతంలో జర్మనీలో నివసించారు. 2021 ఏప్రిల్లో నెలల వయసున్న కుమార్తె అరిహా షా తలకు గాయమైంది. అలాగే అదే ఏడాది సెప్టెంబర్లో స్నానం చేయిస్తుండగా ఆ చిన్నారి ప్రైవేట్ భాగాలపై మరో గాయమైంది.
కాగా, ఈ రెండు సంఘటనలు జర్మనీ అధికారుల దృష్టికి వెళ్లాయి. తమ కుమార్తెకు ప్రమాదవశాత్తు ఆ గాయాలైనట్లు తల్లిదండ్రులు చెప్పారు. అయితే పాప సంరక్షణ పట్ల పేరెంట్స్ నిర్లక్ష్యం వహించడాన్ని జర్మనీ అధికారులు సీరియస్గా తీసుకున్నారు. చిన్నారి అరిహాను వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. జర్మనీ యువజన సంక్షేమ కార్యాలయానికి ఆ పాపను అప్పగించారు. ప్రస్తుతం రెండేళ్లు దాటిన (27 నెలల) అరిహా, 2021 సెప్టెంబర్ నుంచి జర్మనీ యువజన సంక్షేమ కార్యాలయం కస్టడీలో ఉన్నది.
మరోవైపు కుమార్తె అరిహాను తమ కస్టడీకి అప్పగించాలని తల్లిదండ్రులు తొలుత జర్మనీ కోర్టును కోరారు. అందుకు కోర్టు నిరాకరించింది. ఈ నేపథ్యంలో తమ చిన్నారిని భారతీయ సంక్షేమ సేవా సంస్థకు అప్పగించాలంటూ తాజాగా బెర్లిన్లోని పాంకోవ్లోని కోర్టును అభ్యర్థించారు. అయితే పాప అరిహాకు ఎలాంటి ప్రమాదం జరుగకుండా ఉండేందుకు పేరెంట్స్ లేదా భారతీయ సంక్షేమ సంస్థకు అప్పగించబోమని జర్మనీ కోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. దీంతో తమ కుమార్తె బాధ్యతను 140 కోట్ల భారతీయులకు వదిలేస్తున్నట్లు అరిహా తల్లిదండ్రులు తెలిపారు. తమ పాపను వెనక్కి రప్పించడంలో భారత ప్రభుత్వం, ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్పై తమకు నమ్మకం ఉందని చెప్పారు.
కాగా, జర్మనీ తీరు ఆందోళన కలిగిస్తున్నదని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. అరిహా సామాజిక, సాంస్కృతిక, భాషా హక్కులకు భంగం వాటిల్లుతున్నదని ఆవేదన వ్యక్తం చేసింది. మరోవైపు భారత్లోని 19 రాజకీయ పార్టీలకు చెందిన 59 మంది ఎంపీలు కూడా ఇటీవల జర్మనీ రాయబారికి ఒక లేఖ రాశారు. అరిహాను భారత్కు అప్పగించాలని కోరారు. తమ చిన్నారి సంక్షేమాన్ని భారత్ బాగా చూసుకుంటుందని అందులో పేర్కొన్నారు.