బెర్లిన్: ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్ ఎయిర్పోర్ట్ ( Kabul Airport ) వద్ద కాల్పుల ఘటన జరిగింది. అక్కడ పహారా కాస్తున్న దళాల మధ్యే కాల్పులు ఘటన చోటుచేసుకున్నట్లు జర్మనీ ఆర్మీ పేర్కొన్నది. ఆ ఘటనలో ఒకరు మృతిచెందినట్లు జర్మనీ ఆర్మీ చెప్పింది. పాశ్చాత్య దళాలు, ఆఫ్ఘన్ గార్డ్స్ మధ్య కాల్పుల ఘర్షణ జరిగింది. కాబూల్ ఎయిర్పోర్ట్ వద్ద ఉన్న నార్త్ గేట్ దగ్గర ఈ సంఘటన జరిగింది. వేలాది మంది ఆఫ్ఘన్లు, విదేశీయులు ఎయిర్పోర్ట్కు పోటెత్తిన సమయంలో ఈ కాల్పులు ఘటన జరిగినట్లు తెలుస్తోంది. కాల్పుల్లో మృతిచెందింది ఆఫ్ఘన్ గార్డ్ అని తేలింది. మరో ముగ్గురు గాయపడ్డారు. అమెరికా, జర్మనీ దళాలు కాల్పులు జరిపినట్లు జర్మనీ ఆర్మీ తన ట్విట్టర్లో చెప్పింది. అయితే చనిపోయిన ఆఫ్ఘన్ .. విమానాశ్రయం వద్ద ఉన్న తాలిబన్ ఫైటరా అన్న విషయం స్పష్టంగా తెలియదు. గత ఆదివారం నుంచి కాబూల్ విమానాశ్రయం వద్ద గందరగోళ పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. తాలిబన్ల ఆక్రమణతో అక్కడ పరిస్థితులు అద్వాన్నంగా తయారయ్యాయి.