వాషింగ్టన్: హిందూ(Hindus) మతస్తులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ.. అమెరికాలోని జార్జియా రాష్ట్రం తీర్మానాన్ని(Resolution) ప్రవేశపెట్టింది. హిందూఫోబియా(Hinduphobia)ను ఖండిస్తూ శాసనపద్ధతిలో అమెరికాలో ఓ రాష్ట్రం నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి. ప్రపంచంలోని అతిపెద్ద మతాల్లో హిందూ మతం ఒకటని, చాలా పురాతనమైన మతమని, ఆ మతాన్ని అనుసరించేవాళ్లు సుమారు వంద కోట్లకు పైగా ఉంటారని, భిన్నమైన సంస్కృతులు, నమ్మకాలతో హిందువులు జీవిస్తారని ఆ తీర్మానంలో పేర్కొన్నారు.
ప్రజాప్రతినిధులు లారెన్ మెక్డోనాల్డ్(Lauren McDonald), టాడ్ జోన్స్(Todd Jones) ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అట్లాంటాలోని ఫ్రోస్తీ కౌంటీకి చెందిన ప్రాంతంలో హిందువులు, ఇండో అమెరికన్లు భారీ సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. మెడిసిన్, సైన్స్, ఇంజినీరింగ్, ఐటీ, ఫైనాన్స్, మాన్యుఫ్యాక్చరింగ్, ఎనర్జీ, రిటేల్ ట్రేడ్, హాస్పిటాల్లీ రంగాల్లో ఇండో అమెరికన్ వర్గీయుల పాత్ర విశేషంగా ఉందని తీర్మానంలో పేర్కొన్నారు. యోగా, ఆయుర్వేద, మెడిటేషన్, ఫుడ్, మ్యూజిక్, ఆర్ట్స్ రంగాలతోనూ సాంస్కృతికంగా ఎంతో తోడ్పాటు అందించారని, అమెరికా సమాజంలో లక్షల సంఖ్యలో జీవితాలను మార్చినట్లు తీర్మానంలో తెలిపారు.
ఇటీవల హిందూ అమెరికన్లపై పలు దేశాల్లో దాడులు జరుగుతున్నాయని, హిందూఫోబియా దాడుల్ని తీర్మానం ఖండించింది. హిందూ మతానికి చెందిన పవిత్ర గ్రంధాలు, సాంస్కృతిక విధానాలపై దాడి జరుగుతున్నట్లు తీర్మానంలో పేర్కొన్నారు.