లిబ్రెవిల్లే: గబాన్ విదేశాంగ మంత్రి మైఖేల్ మౌసా అడామో హఠాన్మరణం చెందారు. క్యాబినెట్ మీటింగ్ జరుగుతుండగానే ఒక్కసారిగా గుండెపోటు రావడంతో ఆయన కుప్పకూలారు. ఈ విషయాన్ని గబాన్ అధ్యక్షుడు అలీ బొంగో ఒడింబా ట్విటర్ ద్వారా తెలియజేశారు. అడామో మరణం దేశానికి తీరని లోటు అని, తనకు ఎంతో నమ్మకస్తుడైన దౌత్యవేత్తను కోల్పోయానని ఒడింబా ట్వీట్ చేశారు.
అడామో (62) శుక్రవారం జరిగిన క్యాబినెట్ మీటింగ్లో పాల్గొన్నాడు. మీటింగ్ జరుగుతుండగానే గుండెపోటు రావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కాగా, అడామో మృతికి వివిధ దేశాలకు చెందిన అధినేతలు సంతాపాలు తెలియజేస్తున్నారు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా ట్విటర్ ద్వారా సంతాపం ప్రకటించారు. అడామో కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.