వాషింగ్టన్: ఉక్రెయిన్పై దాడి చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని జీ7 దేశాలు రష్యాను హెచ్చరించాయి. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, అమెరికా, బ్రిటన్తో కూడిన ఏడు సంపన్న ప్రజాస్వామ్య దేశాల సమూహం ఈ మేరకు ఒక తీర్మానాన్ని ప్రతిపాదించింది. ఉక్రెయిన్కు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో రష్యా సైనిక మోహరింపు, నిర్మాణాలు ఆ దేశంపై దాడి కోసమేనని జీ7 దేశాలు భావిస్తున్నాయి. 2022 జనవరికి ముందుగానే ఉక్రెయిన్పై రష్యా దాడి చేసే అవకాశమున్నదని అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు అంచనా వేశారు.
ఈ నేపథ్యంలో రష్యా సైనిక మోహరింపును జీ7 ప్రతినిధులు ఖండించారు. పరిస్థితిని తీవ్రం చేయవద్దని రష్యాను హెచ్చరించారు. ‘ఉక్రెయిన్పై రష్యా సైనిక దురాక్రమణ భారీ పరిణామాలు, తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు’ అని ముసాయిదా తీర్మానంలో పేర్కొన్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది.
కాగా, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గత మంగళవారం ఫోన్లో మాట్లాడుకున్నారు. ఉక్రెయిన్పై సైనిక దాడిని ప్రారంభిస్తే రష్యా ఆర్థిక వ్యవస్థకు జరిగే వినాశకరమైన పరిణామాల గురించి పుతిన్ను హెచ్చరించినట్లు బైడెన్ శనివారం తెలిపారు. ‘అధ్యక్షుడు పుతిన్కి నేను ఖచ్చితంగా స్పష్టం చేశాను. ఉక్రెయిన్పైకి వెళితే, అతడి ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయని చెప్పాను’ అని అన్నారు. అయితే ఉక్రెయిన్పై రష్యా దాడి చేస్తే అమెరికా దళాలను పంపే ప్రతిపాదన ఏదీ టేబుల్పై లేదన్నారు.
మరోవైపు, ఉక్రెయిన్పై తాము దాడికి యత్నిస్తున్నట్లుగా వస్తున్న వార్తలను రష్యా ఖండించింది. తమ భూభాగంలోనే బలగాలను తరలిస్తున్నట్లు క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ గ్రీక్ టీవీ చానల్తో అన్నారు. అమెరికా యుద్ధ విమానాలు, సైనిక పరికరాలు ఉక్రెయిన్ సరిహద్దులకు చేరుతున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ముప్పుగా భావించే సరిహద్దు ప్రాంతాలకు దగ్గరగా తమ బలగాలను తరలిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.