వాషింగ్టన్: వివిధ బహుళజాతి సంస్థలు, కార్పొరేట్ సంస్థల అధినేతలు వివిధ కంపెనీల్లో పెట్టిన పెట్టుబడులకు పన్ను మినహాయింపులు ఉండేవి. ఉదాహరణకు మలేషియా వంటి కొన్ని దేశాల్లోని సంస్థల పేరిట పెట్టుబడులు పెడితే పన్ను మినహాయింపు లభించేది. కానీ దానికి ఇక చెల్లు చీటి చెప్పేందుకు జీ-20 దేశాలు సుముఖత వ్యక్తం చేశాయి.
వివిధ దేశాల్లో పెట్టుబడులపై పన్ను తగ్గించుకునేందుకు కార్పొరేట్ సంస్థలు అనుసరించే వ్యూహాలకు చెక్ పెట్టాయి. ఆయా కంపెనీలు పెట్టుబడులు పెట్టిన దేశాలకు కనీసం 15 శాతం గ్లోబల్ కార్పొరేట్ లేవీ చెల్లించాలని నిర్ణయించాయి. ఈ మేరకు శనివారం వెనిస్లో జరిగిన జీ-20 దేశాల గ్రూప్ తీర్మానించింది.
వెనిస్లో జరిగిన జీ-20 దేశాల ఆర్థిక మంత్రుల సమావేశంలో అమెరికా ఆర్థిక మంత్రి జానెట్ యెల్లెన్ ఈ మేరకు ప్రతిపాదన చేశారు. దీంతో పెట్టుబడులను ఆకర్షించేందుకు పన్ను రాయితీలు ప్రకటించడానికి వివిధ దేశాలకు ఇక అవకాశం ఉండదు.
గ్లోబల్ కార్పొరేట్ లెవీపై పారిస్ కేంద్రంగా పని చేస్తున్న ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్లో చర్చలు, సంప్రదింపులు జరిపిన మీద విధి విధానాలు ఖరారవుతాయి.
రోమ్లో వచ్చే అక్టోబర్ 30-31 తేదీల మధ్య జీ-20 దేశాల అధ్యక్షులు, ప్రధానుల ఆధ్వర్యంలో జరిగే శిఖరాగ్ర సదస్సులో తుది నిర్ణయం తీసుకుంటారు. 2023 ప్రారంభం నుంచి కార్యాచరణ అమలులోకి వస్తుందని భావిస్తున్నారు.