2022 ముగింపు దశకు చేరింది. ఎన్నో ఆటుపోట్లు, సంతోషాలు, దుఃఖాలతో ఈ ఏడాదికి వీడ్కోలు పలికేందుకు ప్రపచమంతా సిద్ధమవుతోంది. 2023కి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ప్రజలంతా రెడీ అవుతున్నారు. ఈ సందర్భంగా ఈ ఏడాది కొందరు ఎక్కువగా వార్తల్లో నిలిచారు. వారెవో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ఏడాది ప్రారంభంలో అందరూ ఎక్కువగా విన్నపేరు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. ఆ దేశంపై రష్యా చేపట్టిన యుద్ధం నేపథ్యంలో ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించి అంతర్జాతీయంగా హీరో అయ్యారు. క్రెమ్లిన్ దాడిలో అతలాకుతలమైన తమ దేశాన్ని కాపాడుకునేందుకు ఎదురొడ్డి పోరాడుతున్న ఆ దేశ సైనికులకు వెన్నంటే ఉంటూ.. రోజూవారి ప్రసంగాలు, సోషల్ మీడియా పోస్టులతో ప్రపంచ దృష్టిని ఆకర్షించి వార్తల్లో నిలిచారు. జెలెన్స్కీ ప్రయత్నాలు ఫలించి రష్యాపై పలు దేశాలు నిషేధాన్ని విధించడం, ప్రపంచ కంపెనీలు రష్యా నుంచి వైదొలగడం వంటి పరిణామాలతో ఈ ఏడాది ఎక్కువగా జెలెన్స్కీ వార్తల్లో నిలిచారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై దండయాత్ర మొదలు పెట్టారు. అయితే ఈ యుద్ధం చాలా సులభంగా గెలుస్తామని పుతిన్ ముందుగా ఊహించారు. అయితే, ఈ యుద్ధంలో ఊహించని విధంగా ఉక్రెయిన్కు పలు దేశాలు మద్దతు ప్రకటించడంతో ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఉక్రెయిన్పై క్రెమ్లిన్ చేపట్టిన దండయాత్ర రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత ఘోరమైన యూరోపియన్ సంఘర్షణకు దారితీసింది. 1962 క్యూబా క్షిపణి సంక్షోభం తర్వాత మాస్కో, పశ్చిమ దేశాల మధ్య అతిపెద్ద ఘర్షణకు దారితీసింది. దీంతోపాటు పుతిన్ ఆరోగ్య పరిస్థితిపై కూడా అంతర్జాతీయ మీడియాలో పలు రకాల కథనాలు వెలువడ్డాయి. దీంతో ఈ ఏడాది ఆయన ఎక్కువ సార్లు వార్తల్లో నిలిచారు.
టెస్లా సీఈవో ఎలాన్ మస్క్.. ఈ ఏడాది అక్టోబర్ నెలలో ప్రముఖ మైక్రోబ్లాగింగ్ వెబ్సైట్ ట్విట్టర్ను 44 బిలియన్ డాలర్లకు హస్తగతం చేసుకున్నారు. సంస్థను తన గుప్పిట్లోకి తీసుకున్న మస్క్.. అప్పటి నుంచి పలు సంచలన నిర్ణయాలతో విమర్శల పాలయ్యారు. ఉద్యోగులకు లేఆఫ్స్, ట్విట్టర్ బ్లూటిక్ కోసం డబ్బులు వసూలు చేయడం, ఉద్యోగులను ఎక్కువ గంటలు పనిచేయమని ఆదేశించడం వంటి వాటితో ఈ ఏడాది ఎక్కువగా వార్తల్లో నిలిచారు మస్క్. వీటితోపాటు ప్రపంచ కుబేరుల్లో మొదటి స్థానంలో ఉన్న మస్క్.. ఇటీవల రెండో స్థానానికి పడిపోవడం కూడా ఇందుకు కారణమైంది.
భారతదేశాన్ని 200 ఏండ్లపాటు నిరంకుశంగా పాలించిన బ్రిటన్కు మొదటిసారి భారత సంతతికి చెందిన రిషి సునాక్ ప్రధాని అయ్యారు. తీవ్రమైన రాజకీయం సంక్షోభంతో బోరిస్ జాన్సన్ గద్దెదిగడంతో జరిగిన ఎన్నికల్లో గెలిచిన లిజ్ట్రస్.. బోరిస్ స్థానంలో బ్రిటన్ పగ్గాలు చేపట్టారు. అయితే ఆమె ప్రధాని పీఠం అధిరోహించిన రోజుల వ్యవధిలోనే తన పదవికి రాజీనామా చేసింది. సెప్టెంబర్ 7న యూకే ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన ఆమె కేవలం 44 రోజులకే రాజీనామా చేశారు. దీంతో బ్రిటన్ చరిత్రలో అతి తక్కువ కాలం పనిచేసిన ప్రధానిగా లిజ్ ట్రస్ రికార్డులకెక్కారు కూడా. అనంతరం జరిగిన ఎన్నికల్లో రిషి సునాక్ గెలిచి రికార్డు సృష్టించారు. బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన అత్యంత పిన్న వయస్కుడిగా రిషి సునాక్ నిలిచారు. దీంతో ఆయన ఈ ఏడాది ఎక్కు సార్లు వార్తల్లో నిలిచారు.
భారతదేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము బాధ్యతలు చేపట్టారు. భారత రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి గిరిజన మహిళగా ముర్ము చరిత్ర సృష్టించారు. దేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహించిన రెండో మహిళగా కూడా ముర్ము నిలిచారు.
హాలీవుడ్ మాజీ జంట జానీ డెప్, అంబర్ హర్డ్ పరువు నష్టం దావా వ్యవహారం ఈ ఏడాది అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ మాజీ జంట 2015లో వివాహం చేసుకున్నారు. కానీ, ఏడాదికే వాళ్ల కాపురంలో మనస్పర్థలు చోటు చేసుకోవడంతో.. 2017లో అధికారికంగా విడాకులు తీసుకుని తమ బంధానికి స్వస్తి పలికారు. అనంతరం ఇద్దరూ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఎక్కువగా వార్తల్లోకి ఎక్కారు. ఇది వాళ్ల వాళ్ల కెరీర్ ను సైతం దెబ్బ తీసింది.
ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ తొందరపాటు నిర్ణయంతో ఈ ఏడాది ఎక్కుగా వార్తల్లో నిలిచారు. అవార్డుల ప్రదానోత్సవ వేదికపై వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కమెడియన్ క్రిస్ రాక్ పై విల్ స్మిత్ చేయి చేసుకున్నారు. దీంతో అతని ప్రవర్తన పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఘటన తరువాత అదే వేదికపై ఉత్తమ నటుడిగా ఆస్కార్ అందుకున్న విల్ స్మిత్ .. క్రిస్ రాక్కు క్షమాపణలు కూడా చెప్పారు. మరుసటి రోజు ఇన్ స్టాగ్రామ్ వేదికగా స్పందించిన విల్ స్మిత్.. తన భార్యపై జోకులు వేయడంతో భరించలేకనే అలా ప్రవర్తించానని వెల్లడించారు.
ఏడు దశాబ్దాల పాటు బ్రిటన్ను పాలించిన క్వీన్ ఎలిజిబెత్-2 ఈ ఏడాది సెప్టెంబర్లో మరణించిన విషయం తెలిసిందే. అనంతరం ఆమె పెద్ద కుమారుడు చార్లెస్-3 బ్రిటన్ నూతన రాజుగా బాధ్యతలు చేపట్టారు. 73 ఏళ్ల వయసులో ఉన్న చార్లెస్- 3.. బ్రిటన్ రాజరిక వ్యవస్థలతో అత్యంత ఎక్కువ వయసులో రాజుగా బాధ్యతలు చేపట్టిన వారిగా రికార్డులకు ఎక్కారు. ఇదిలా ఉంటే… బ్రిటన్ రాజుగా చార్లెస్- 3 పదవీ బాధ్యతలు చేపడుతున్న కార్యక్రమాన్ని టీవీల్లో ప్రసారం చేశారు. ఇలా రాజరిక మార్పు కార్యక్రమాన్ని టీవీల్లో ప్రసారం చేయడం ఇదే తొలిసారి. దీంతో ఈ ఏడాది ఆయన ఎక్కువ సార్లు వార్తల్లో నిలిచారు.
సంప్రదాయ ముస్లిం దేశమైన ఇరాన్లో మహిళలపై ఆంక్షలు చాలా ఎక్కువ. వాళ్ల డ్రెస్ కోడ్పై మోరల్ పోలీసుల నిఘా ఉంటుంది. హిజాబ్ సరిగా ధరించలేదనే కారణంతో మహిసాను సెప్టెంబర్ 20వ తేదీన మోరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజుల అనంతరం ఆమె కస్టడీలో అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. దాంతో ప్రజలు పెద్ద సంఖ్యలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాదాపు 3 నెలలుగా హిజాబ్, మోరల్ పోలీసింగ్ వ్యతిరేక నినాదాలు, నిరసనలతో ఇరాన్ అట్టుడుకిపోయింది. ఈ నిరసనల్లో దాదాపు 300 మందికి పైగా పౌరులు చనిపోయారు. ఇరాన్లో 1979 విప్లవం తర్వాత ఈ స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత పెరగడం ఇదే మొదటిసారి. ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం మోరల్ పోలీసింగ్ను నిషేధిస్తూ నిర్ణయం కూడా తీసుకుంది. దీంతో ఈ ఏడాది మహిసా ఎక్కువగా వార్తల్లో నిలిచింది.